Happy New Year: న్యూ ఇయర్ జోష్
ABN , Publish Date - Jan 01 , 2024 | 01:12 AM
నగరంలో ఆదివారం అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.
![Happy New Year: న్యూ ఇయర్ జోష్](https://media.andhrajyothy.com/media/2023/20231205/YRK_1941_cc99023fd5.jpg)
కొత్త సంవత్సర వేడుకలతో హోరెత్తిన నగరం
స్టార్ హోటళ్లలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యువతతో కిక్కిరిసిన బార్లు, హోటళ్లు
తీరంలో అంబరాన్నంటిన సంబరాలు
మద్యం దుకాణాల ఎదుట బారులుతీరిన మందుబాబులు
తెలుగుతల్లి ఫ్లైవోవర్ మూసివేత, బీచ్రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఆదివారం అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కు వీడ్కోలు, 2024కు స్వాగతం చెబుతూ నగరవాసులంతా హంగామా చేశారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఘనంగా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరైతే వారం ముందు నుంచే కొత్త సంవత్సరం వేడుకలకు సన్నాహాలు చేసుకున్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు నగరంలో స్టార్హోటళ్లు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసి, అర్థరాత్రి 12 గంటలకు కేక్ కత్తిరించి వేడుకలు నిర్వహించాయి. సినీ, టీవీ నటులతో నిర్వహించిన కార్యక్రమాలకు భారీగా జనం హాజరయ్యారు. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన వారితో బార్లు కిక్కిరిసిపోయాయి. మద్యం దుకాణాల ఎదుట మందు ప్రియులు బారులు తీరారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో విశాఖ చేరుకున్న వేలాదిమంది కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెలుగుతల్లి ఫ్లైవోవర్ను సాయంత్రం నుంచే మూసివేశారు. బీచ్రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ రోడ్డుపై వాహనాలను రాత్రి పది గంటల తరువాత సిరిపురం జంక్షన్, పార్కుహోటల్ జంక్షన్ వద్దే నిలువరించారు. సంబరాలు జరుపుకోవాలనుకునే వారంతా అక్కడి నుంచి నడుచుకుంటూ బీచ్రోడ్డుకు చేరుకుని, తీరంలో కేకులు కత్తిరించి సందడి చేశారు. కాగా నూతన సంవత్సరానికి సంప్రదాయ రీతిన స్వాగతం పలికేందుకు మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్దారు. అర్ధరాత్రి 12 గంటల సమయానికి సమీప దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.