కొత్త ఓటర్లు 14,475
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:52 AM
జిల్లాలో గురువారం నాటికి ఓటర్ల సంఖ్య 19,62,440కు చేరింది.
జిల్లాలో 19,62,440కు చేరిన ఓటర్ల సంఖ్య
భీమిలిలో అత్యధికంగా 3,55,081 మంది
విశాఖపట్నం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గురువారం నాటికి ఓటర్ల సంఖ్య 19,62,440కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తరువాత కొత్తగా చేర్పులు, తొలగింపులు చేపట్టారు. ఇందులో భాగంగా గత 38 రోజుల్లో 24,781 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా 4,934 మందిని జాబితా నుంచి తొలగించారు.
జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికంగా భీమిలిలో ఓటర్ల సంఖ్య 3,55,081కు చేరింది. తాజాగా ఓటర్ల నమోదు తరువాత మూడు లక్షల ఓటర్లు దాటిన నియోజకవర్గాల్లో భీమిలి, గాజువాక సరసన పెందుర్తి కూడా చేరింది. జనవరి 22వ తేదీ నాటి తుది జాబితాలో పెందుర్తిలో 2,99,103 మంది ఓటర్లు ఉన్నారు. మూడు లక్షల ఓట్లు దాటిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఐదు ఉండగా వాటిలో మూడు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన జాబితా మేరకు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 19,42,593 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్కు పదిరోజుల ముందు వరకు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం ఉంది. అదే సమయంలో ఓటర్ల జాబితాలో మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాటిలో ఒక ఓటు ఉంచి, మిగిలిన ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో జనవరి 22వ తేదీ నుంచి గురువారం వరకు 24,781 మంది కొత్తగా ఓటరుగా నమోదు కాగా 4,934 మందిని తొలగించారు. కొత్త ఓటర్లగా జిల్లాలో అత్యధికంగా గాజువాకలో 4,546 మంది చేరగా, తక్కువగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 2,118 మంది చేరారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత పోలింగ్కు పదిరోజుల ముందు వరకు కొత్తగా ఓటర్ల చేర్పులు, మార్పులకు అవకాశం ఉన్నందున జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు
అసెంబ్లీ సెగ్మెంట్ జనవరి 22 ఫిబ్రవరి 29
భీమిలి 3,51,462 3,55,081
విశాఖ తూర్పు 2,76,523 2,80,609
విశాఖ దక్షిణ 2,10,131 2,11,906
విశాఖ ఉత్తర 2,74,760 2,77,904
విశాఖ పశ్చిమ 2,06,943 2,08,880
గాజువాక 3,23,671 3,27,269
పెందుర్తి 2,99,103 3,00,791