పాఠశాలల పునఃప్రారంభం రోజే హాజరుకావాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:37 AM
విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని స్థానిక ఏటీడబ్ల్యూవో బి.జయ నాగలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయన్నారు.

తల్లిదండ్రులతో విద్యార్థులు రావాలి
ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి
చింతపల్లి, జూన్ 6: విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని స్థానిక ఏటీడబ్ల్యూవో బి.జయ నాగలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయన్నారు. వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థినీ, విద్యార్థులు తొలి రోజే పాఠశాలకు హాజరుకావాలన్నారు. సాధారణంగా విద్యార్థులు రెండు, మూడు రోజులు ఆలస్యంగా పాఠశాలలకు వస్తుంటారన్నారు. విద్యార్థులు ముందుగా పాఠశాలకు హాజరుకావడం వల్ల విద్యాబోధన ప్రారంభించేందుకు అనువుగా ఉంటుందన్నారు. ఈ ఏడాది పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులకు వైద్య సిబ్బందితో ఆరోగ్య తనిఖీలు చేయిస్తామన్నారు. దీంతో ఆనారోగ్య సమస్యలు గుర్తిస్తే మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరన్నారు. ఇళ్ల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు మాత్రమే తీసుకు వచ్చి పాఠశాలలో అప్పగించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిసి విద్యార్థినీ, విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఎవరైనా విద్యార్థులు సెలవుల్లో అస్వస్థతకు గురైతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెచ్డబ్ల్యూవోలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెచ్డబ్ల్యూవోలు పాఠశాల తరగతి గదులు, వసతి గృహాలు శుభ్రం చేయించి సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీ సీట్లు ఆశ్రమ పాఠశాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించామని, తల్లిదండ్రులు ఖాళీలు ఆధారంగా పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు.