వైసీపీ నుంచి భారీ వలసలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:32 AM
పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు గురువారం ఆ పార్టీకి గుడ్బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. వీరిలో ఇద్దరు సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు వున్నారు.
పరవాడ, దోసూరు సర్పంచులతోపాటు పలువురు నాయకులు జనసేనలో చేరిక
పార్టీ కండువాలు కప్పి ఆహానించిన పెందుర్తి, ఎలమంచిలి అభ్యర్థులు పంచకర్ల, సుందరపు
పరవాడ/ అచ్యుతాపురం, ఏప్రిల్ 18: పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు గురువారం ఆ పార్టీకి గుడ్బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. వీరిలో ఇద్దరు సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు వున్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో మండల కేంద్రమైన పరవాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు, ఆయన అనుచరులు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. గురువారం పరవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేశ్బాబు సమక్షంలో సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడుతోపాటు పరవాడ పెద్ద చెరువు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీను, పలువురు వార్డు మెంబర్లు, సుమారు 300 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అలాగే గొర్లివానిపాలెం పంచాయతీలో వైసీపీకి చెందిన పైలా దినేశ్, తన వందమంది అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. జీవీఎంసీ 85వ వార్డు మంత్రిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకురాలు పచ్చికోరు వెంకట వరలక్ష్మి 50 మందితో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ రమేశ్బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పైలా జగన్నాథరావు, ఏఎంసీ మాజీ వైస్చైర్మన్ కన్నూరు వెంకటరమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైసీపీ నుంచి జనసేనలోకి దోసూరు సర్పంచ్..
అచ్యుతాపురం, ఏప్రిల్ 18: మండలంలోని దోసూరు సర్పంచ్ నర్మాల సుజాత, ఆమె భర్త రామకృష్ణ తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. అచ్యుతాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలమంచిలి అభ్యర్థి సుందరపు విజయకుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా ఉప్పవరం మాజీ సర్పంచ్ అడపా మహలక్ష్మి నాయుడు తన అనుచరులతో కలిసి జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్యప్రతినిధి సుందరపు సతీశ్కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. పూడిమడకలో కూడా పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో జనపరెడ్డి శ్రీనివాసరావు, డీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.