ఏడుచోట్ల ఎల్ఈడీ స్ర్కీన్లు
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:00 AM
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
![ఏడుచోట్ల ఎల్ఈడీ స్ర్కీన్లు](https://media.andhrajyothy.com/media/2024/20240604/babu_f65d2a7c6c.jpg)
చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవం
వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
నియోజకవర్గానికొకటి....
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో పీఎం పాలెం సీతారామస్వామి దేవాలయం సమీపాన గల జీవీఎంసీ కమ్యూనిటీ హాలులో స్ర్కీన్ ఏర్పాటుచేస్తున్నట్టు కలెక్టర్ ఒక ప్రకటించారు. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా, దక్షిణ నియోజకవర్గ పరిధిలో 31వ వార్డు డ్వాక్రా బజార్లోని జీవీఎంసీ భవనంలో, ఉత్తర నియోజకవర్గ పరిధిలోని అక్కయ్యపాలెం షాదీఖానాలో, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కంచరపాలెం కాయిత పైడియ్య కళ్యాణ మండపంలో, పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట కమ్యూనిటీ హాలులో, గాజువాక చైతన్యనగర్లో స్ర్కీన్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కార్యక్రమం నిర్వహణకు నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులు, సహాయ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి 35 బస్సులు కేటాయింపు
ద్వారకా బస్స్టేషన్, జూలై 10:
నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే కార్యకర్తల కోసం విశాఖపట్నం నుంచి 35 బస్సులు కేటాయించినట్టు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు ఐదు బస్సులు చొప్పున ఇచ్చినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు, టీడీపీ నాయకులు ఈ బస్సులు బుక్ చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎక్స్ప్రెస్, డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్, సూపర్ లగ్జరీ కేటగిరీలకు చెందిన బస్సులను టీడీపీ కార్యకర్తల కోసం కేటాయించినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అందవరపు అప్పలరాజు తెలిపారు. ఈ బస్సులు మంగళవారం సాయంత్రం/రాత్రి విశాఖపట్నం నుంచి బయలుదేరతాయన్నారు. గన్నవరంలో సీఎం సభ ముగిసిన తరువాత బుధవారం మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి విశాఖపట్నం చేరుకుంటాయని తెలిపారు.