ఉద్యోగుల సమస్యల పరిష్కారమే కాదు.. సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 18 , 2024 | 01:23 AM
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలోనే కాకుండా వారి సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
నక్కపల్లి/కోటవురట్ల, జూన్ 17: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలోనే కాకుండా వారి సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.సత్తిబాబు, డీ సీతారామరాజు నేతృత్వంలో పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం హోం మంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో అనిత మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు ఏమైనా వుంటే వినతిపత్రం అందజేస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలతోపాటు, ఉద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించడంతో కూటమికి అనూహ్య విజయం దక్కిందన్నారు. హోం మంత్రిని కలిసిన వారిలో ఉద్యోగ సంఘ ప్రతినిధులు రమణబాబు, నరసింగరావు, గంగాధర్, సత్యనారాయణ, త్రినాధ్స్వామి, పీవీఎన్మూర్తి, పరదేశినాయుడు, తదితరులు పాల్గొన్నారు.