Share News

నగరంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు?

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:14 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొన్ని మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నగరంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు?

ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆసక్తి

విశాఖపట్నం (స్పోర్ట్సు), ఫిబ్రవరి 16:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొన్ని మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా రెండు లేదా మూడు మ్యాచ్‌లు జరిగే సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఇటీవల భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ యంత్రాంగం ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. తొలుత కేవలం ప్రాక్టీ్‌సకు మాత్రమే వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రతినిధులు ఇక్కడి సదుపాయాలు చూసి మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడే రెండు మ్యాచ్‌లకు పీఎం పాలెం స్టేడియం వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చెన్నై సూపర్‌కింగ్స్‌ కూడా ఇక్కడ మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపుతోందని సమాచారం. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానుంది. కాగా 2012లో డెక్కన్‌ చార్జర్స్‌, 2015లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 2016లో ముంబై ఇండియన్స్‌ జట్లు ఆడిన మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నిలిచింది.

Updated Date - Feb 17 , 2024 | 01:14 AM