Share News

పెరిగిన విమానయానం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:55 AM

విశాఖపట్నం విమానాశ్రయం పురోభివృద్ధి సాధిస్తోంది.

పెరిగిన విమానయానం

  • విశాఖ నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25,00,654 మంది ప్రయాణం

  • 2023-24లో 27,84,428

  • 10.19 శాతం పెరిగిన ప్రయాణికులు

  • వారం రోజుల్లో మలేషియా విమానం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం పురోభివృద్ధి సాధిస్తోంది. గత ఏడాది కాలంలో ప్రయాణికుల సంఖ్య 10.19 శాతం పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25,00,654 మంది ప్రయాణం చేయగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 27,84,428కి పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2,85,974 మంది ప్రయాణికులు పెరిగారు. అంటే సగటున నెలకు 23,831 మంది, రోజుకు 794 మంది అధికంగా ప్రయాణించారు. గత ఏడాది మే నెలలో అత్యధికంగా 2,90,182 మంది ప్రయాణించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,91,189 మంది ప్రయాణించారు. వాస్తవానికి నవంబరు నుంచి మార్చి 31 వరకు రన్‌వే రీ సర్ఫేసింగ్‌ పనుల వల్ల రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు విమానాల రాకపోకలు రద్దు చేశారు. దాంతో పలు సర్వీసులు రద్దయ్యాయి. అందువల్ల ప్రయాణికుల సంఖ్య కొంత వరకు తగ్గింది. లేదంటే ఇంకా ఎక్కువ మంది ప్రయాణించి ఉండేవారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, కుమార్‌రాజా, వర్మలు తెలిపారు. అలాగే వారం రోజుల్లో మలేషియాకు అంతర్జాతీయ విమానం అందుబాటులోకి రానుందని చెప్పారు.

కొత్త సౌకర్యాలు

విమానాశ్రయంలో కొత్తగా ఇన్‌లైన్‌ బ్యాగేజ్‌ స్ర్కీనింగ్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అలాగే డిజి యాత్ర సర్వీసును ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు నిరీక్షించే సమయం తగ్గుతుంది. ఆధార్‌ వెరిఫికేషన్‌ పనులన్నీ వేగవంతంగా పూర్తయి వెయిటింగ్‌ లాంజ్‌కి త్వరగా వెళ్లిపోవచ్చు.

Updated Date - Apr 20 , 2024 | 01:55 AM