మార్కెట్కు వస్తే ముక్కు మూసుకోవాల్సిందే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:28 AM
ఇందిరా మార్కెట్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. మార్కెట్ ఆవరణ డంపింగ్ యార్డును తలపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

దుర్గంధభరితంగా ఇందిరా మార్కెట్
ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారం
పట్టించుకోని అధికారులు
వర్తకులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు
నర్సీపట్నం, జూన్ 6: ఇందిరా మార్కెట్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. మార్కెట్ ఆవరణ డంపింగ్ యార్డును తలపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరా మార్కెట్ ఆవరణలో మాంసం, చేపలు, కూరగాయల వ్యర్థాలను పారేస్తున్నారు.అబీద్ సెంటర్లోని పండ్లు, పూలు, ఆహార పదార్థాల వ్యర్థాలను కూడా ఇక్కడే వేస్తున్నారు. ఈ దుర్గంధభరిత వాతావరణంలోనే మాంసం, చేపలు విక్రయిస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉన్నా మునిసిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. షిరిడి సాయిబాబా గుడికి వచ్చే భక్తులు, ఎన్టీఆర్ మినీ స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, మార్నింగ్ వాక్కు వచ్చే మహిళలు, పురుషులు మార్కెట్ నుంచి వచ్చే దుర్గంధం భరించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్కెట్లోని దుకాణాలకు అద్దెలు వసూలు చేసుకుంటున్న మండల పరిషత్ అధికారులు, అందులో వాటా తీసుకుంటున్న మునిసిపల్ అధికారులు చెత్త సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ఇందిరా మార్కెట్లోని దుకాణాల మీద అద్దెలు మండల పరిషత్ అధికారులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ పారిశుఽధ్యం గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై కమిషనర్ పూడి రవిబాబును వివరణ కోరగా మార్కెట్ శుభ్రం చేయాల్సిన బాధ్యత మండల పరిషత్ అధికారులదని చెప్పారు. అయినప్పటికీ మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తున్నామన్నారు. కూరగాయల వ్యాపారులు సహకరిస్తే ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.