80 పైబడితే ఇంటి నుంచే ఓటు
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:13 AM
ఈసారి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు (పోస్టల్ బ్యాలెట్) వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.

పోస్టల్ బ్యాలెట్ విధానంలో అవకాశం
తొలిసారిగా రెండేళ్ల క్రితం కేరళలో అమలు
జిల్లాలో 80 సంవత్సరాలు దాటినవారు 20,000పైగానే...
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
ఈసారి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు (పోస్టల్ బ్యాలెట్) వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. రెండేళ్ల క్రితం కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తరువాత కర్ణాటక, గత నెలలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇదే విధానం దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి.
జిల్లాలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు సుమారు 20,000కుపైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానున్నది. ఆ తరువాత వృద్ధ ఓటర్ల సంఖ్యపై మరింత స్పష్టత రానున్నది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు తమ ఓటును సీల్డ్ కవర్లో పోస్టు ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపుతున్నారు. అయితే వృద్ధులు ఓటు (సీల్డ్ కవర్లో బ్యాలెట్ పేపర్) వేసేందుకు బాక్సులను వారి వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లుచేస్తారు. ఓటు హక్కు ఇంటి నుంచి వినియోగించుకోవాలంటే 80 ఏళ్లు దాటిన వృద్ధులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు ఖరారైన తరువాత అందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్కు ఒకటి, రెండు రోజులు ముందు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో పోలింగ్ సిబ్బంది వృద్ధుల ఇంటికి వెళ్లి బ్యాలెట్ పత్రం ఇస్తారు. ఓటు వేసిన తరువాత సీల్డు కవర్లో పెట్టి తమతో తీసుకువెళ్లిన బాక్సులో వేసే అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు నియమించుకునే పోలింగ్ ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. కాగా ఇంటి వద్ద నుంచి ఓటు వినియోగించుకోదలచిన వారు ఎక్కువ ఉంటే అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని రిటైర్డు తహసీల్దార్ ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే 80 ఏళ్లు దాటినవారు పోలింగ్ కేంద్రానికి వెళ్లి కూడా ఓటు వేసుకోవచ్చు.