నగరంలో భారీ వర్షం
ABN , Publish Date - Jun 03 , 2024 | 01:22 AM
గడచిన రెండు రోజులుగా నగరంలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున భారీ పిడుగుల శబ్దాలతో ప్రజలు తుళ్లిపడి నిద్రలేచారు. మోస్తరుగా వర్షం కురిసి తరువాత పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత కొనసాగింది. సాయంత్రం నుంచి వాతావరణం మారి చల్లగాలులు వీచాయి.
![నగరంలో భారీ వర్షం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయనగరం వైపు నుంచి మేఘాల రాక
పలుచోట్ల రోడ్లపైకి చేరిన నీరు
విశాఖపట్నం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): cరాత్రి పది గంటల సమయంలో విజయనగరం వైపు నుంచి భారీగా క్యుములోనింబస్ మేఘాలు జిల్లాలో ప్రవేశించాయి. దీంతో సుమారు గంటపాటు ఉరుములు, పిడుగులు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. చెవులు చిల్లులు పడేలా పడిన పిడుగులతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో పలువురు రాత్రి పది గంటల వరకు బీచ్లోనూ, హోటళ్లలో గడిపి ఇళ్లకు బయలుదేరే సమయంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఉన్నవారు తడిసిముద్దయ్యారు. రోడ్లపై వ్యాపారాలు చేసేవారు తినుబండారాలు, ఇతర వస్తువులు తడిసిపోకుండా నానా ఇబ్బందులు పడ్డారు. వర్షానికి మురుగునీరు రహదారులపై ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రుతుపవనాల రాకకు ముందు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు,పిడుగులతో వర్షాలు కురవడం సాధారణమేనని, భారీ సైజులో ఉండే మేఘాల కాలపరిమితి గంట నుంచి రెండుగంటలేనని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. భయపడాల్సిన పనిలేదని, ఉరుములు, పిడుగులు సంభవించేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరగా, ఆరుబయట ఉండకూడదని హెచ్చరించారు.
నగరంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షం
స్టేషన్ మి.మీ.లు
అగనంపూడి ఆస్పత్రి 50.75
గోపాలపట్నం దరి అప్పన్నపాలెం 48.25
గంభీరం 45.5
పెందుర్తి వెంకటాద్రినగర్ 44.25
కాపులుప్పాడ 43.0
సింహాచలం 42.0
శ్రీహరిపురం ఆస్పత్రి 40.5