ఎన్నికల్లో ప్రలోభ పెడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:23 AM
ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
- పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నర్సీపట్నం, మార్చి 28: ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్శెట్టి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులను తనిఖీ చేశారు. నర్సీపట్నం మండలంలోని గబ్బాడ ఎంపీపీ స్కూల్, ఏజెన్సీ లక్ష్మీపురం ఆదర్శ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొలుగొండ మండలం ఎర్రన్నపాలెం, ఏజెన్సీ లక్ష్మీపురంలోని చెక్ పోస్టులు తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, మద్యం, నాటుసారా, గంజాయి రవాణాను అరికట్టాలని గొలుగొండ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఆదేశించారు. నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట నర్సీపట్నం రిటర్నింగ్ అధికారి హెచ్వీ జయరాం, ఎస్ఐ ఉపేంద్ర ఉన్నారు.