కలెక్టర్గా హరేంధిర ప్రసాద్
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:39 AM
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, నగరం గౌరవం పెరిగేలా పనిచేస్తానని కొత్త కలెక్టర్గా నియమితులైన హరేంధిర ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లో తెలిపారు.
విశాఖ గౌరవం పెరిగేలా పనిచేస్తా
‘ఆంధ్రజ్యోతి’తో కొత్త కలెక్టర్ హరేంధిర ప్రసాద్
నేడు బాధ్యతల స్వీకారం
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, నగరం గౌరవం పెరిగేలా పనిచేస్తానని కొత్త కలెక్టర్గా నియమితులైన హరేంధిర ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న హరేంధిర ప్రసాద్ను విశాఖ కలెక్టర్గా వేసింది. ఆయన స్వస్థలం తమిళనాడు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ చదువుకున్నారు. తిరుచ్చిలో ఎంబీఏ చేశారు. ఆరేళ్లు ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ సంస్థల్లో పనిచేశారు. ఆ తరువాత సివిల్ సర్వీసులోకి వచ్చారు. 2015 సెప్టెంబరు నుంచి 2016 జూన్ వరకు ఐఏఎస్ శిక్షణ పొందారు. చిత్తూరులో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అసిస్టెంట్ సెక్రటరీగా మూడు నెలలు చేశారు. కేఆర్ పురం (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) ఐటీడీఏ పీఓగా, సబ్ కలెక్టర్గా 31 నెలలు పనిచేశారు. అక్కడి నుంచి ఆర్థిక శాఖకు వెళ్లారు. డిప్యూటీ సెక్రటరీ కేడర్లో సీఈఓగా ఎఫ్ఎంఎస్లో కొంతకాలం పనిచేశారు. అదే సమయంలో కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా గాను సేవలు అందించారు. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్గా వెళ్లారు. రెండేళ్లు అక్కడ సమర్థంగా పనిచేశారు. ఆ తరువాత విజయవాడకు బదిలీపై వెళ్లి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా సుమారు 17 నెలలు అంటే 2023 నవంబరు వరకు అక్కడే విధులు నిర్వహించారు. ఆ తరువాత రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలకో్ట్రరల్ ఆఫీసర్గా వెళ్లారు. ఇటీవల ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పుడు అక్కడి నుంచి విశాఖపట్నం కలెక్టర్గా వస్తున్నారు. బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. విశాఖకు మంచిపేరు తెచ్చేలా విధులు నిర్వహిస్తానని వెల్లడించారు. ఒక టూరిస్ట్గా మాత్రమే ఇంతకు ముందు విశాఖపట్నం వచ్చానని, ఇప్పుడు కలెక్టర్గా రాబోతున్నానని చెప్పారు.
నెల్లూరు కలెక్టర్గా వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ ఆనంద్
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న ఓ.ఆనంద్ను నెల్లూరు కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్గా చేసిన ఆనంద్ను విశాఖపట్నం తీసుకువచ్చారు. ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో వందల కోట్ల రూపాయల పన్నుల సొమ్ము గోల్మాల్ జరిగింది. ఉద్యోగుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ కేసులో సుమారు పది మందిని బదిలీ చేశారు. పెద్ద ఎత్తున విచారణ జరిగింది. వాటన్నిటిని చక్కదిద్దడానికి ఆనంద్ను తీసుకువచ్చారు. 24/7 పనిచేస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కలెక్టర్గా పదోన్నతిపై నెల్లూరు వెళుతున్నారు.