Share News

నకిలీ సిగరెట్ల కేసులో చేతివాటం

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:37 AM

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాయి.

నకిలీ సిగరెట్ల  కేసులో చేతివాటం

ఈనెల ఒకటో తేదీన మింది వద్ద భారీగా స్వాధీనం

గాజువాక పోలీసులకు అప్పగించిన స్పెషల్‌ స్క్వాడ్‌

రూ.30 లక్షలు విలువైనవిగా లెక్కగట్టిన జీఎస్టీ అధికారులు

రూ.8 లక్షలు మాత్రమేనంటున్న పోలీసులు

ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే వాస్తవాలు వెలుగులోకి..

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల ఒకటో తేదీన మింది వద్ద ప్రత్యేక స్క్వాడ్‌ ఒక కారులో సిగరెట్లను గుర్తించింది. వాటికి సంబంధించిన పత్రాలను అడగ్గా కారులోని వ్యక్తులు చూపించలేదు. నగరంలో గల ఐదుగురు ఐటీసీ డీలర్లను తనిఖీ అధికారులు సంప్రతించగా తమకు సంబంధం లేదని చెప్పారు. సాధారణంగా ఐటీసీ నుంచి సిగరెట్లను కొనుగోలు చేసినట్టయితే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లించినట్టు పత్రాలు లేకపోవడంతో నకిలీ సిగరెట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. జీఎస్టీ అధికారులకు కూడా దీనిపై సమాచారం ఇచ్చి నిబంధనల ప్రకారం కేసు నమోదుచేయాలని కారుతోపాటు సిగరెట్లను గాజువాక పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం సరకు విలువ రూ.30 లక్షలు ఉంటుందని జీఎస్టీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, పోలీసులు మాత్రం కేవలం రూ.8 లక్షలుగా లెక్కించినట్టు తెలిసింది. పైగా ఆ సరకును ఎంవీపీ కాలనీలోని ఒక ఐటీసీ డీలర్‌ నుంచి కొనుగోలు చేసినట్టు బిల్లు తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది. నకిలీ సిగరెట్లు, విదేశీ సిగరెట్లు, ఈ-సిగరెట్లను విక్రయించే గాజువాక ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పలుకుబడి ఉపయోగించడంతో....స్థానికంగా పలువురు ఆయనకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారులతోపాటు జీఎస్టీకి చెందిన అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటపడతాయని ఐటీసీ డీలర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:37 AM