Share News

వేరుశనగ సాగు విస్తరణ ప్రణాళిక

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:48 AM

ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాల్లో వేరుశనగ సాగు విస్తరణకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన కె-7 బోల్డ్‌ విత్తనాలను రైతులకు మినీ కిట్ల రూపంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో అత్యధిక దిగుబడినిచ్చే నూతన వంగడాన్ని కూడా అందజేయాలని పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షి రకంపై పరిశోధనలు చేస్తున్నారు.

వేరుశనగ సాగు విస్తరణ ప్రణాళిక
కె-7 బోల్డ్‌ విత్తనం

- కె-7 బోల్డ్‌ రకం విత్తనం రైతులకు పంపిణీకి శాస్త్రవేత్తల చర్యలు

- ఎకరాకి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి

- పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షిపై పరిశోధనలు

చింతపల్లి, మార్చి 26: ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాల్లో వేరుశనగ సాగు విస్తరణకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. మార్కెట్‌లో అధిక డిమాండ్‌ కలిగిన కె-7 బోల్డ్‌ విత్తనాలను రైతులకు మినీ కిట్ల రూపంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రానున్న రోజుల్లో అత్యధిక దిగుబడినిచ్చే నూతన వంగడాన్ని కూడా అందజేయాలని పరిశోధన స్థానంలో కదిరి లేపాక్షి రకంపై పరిశోధనలు చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల గిరిజన మండలాల్లో 20 ఏళ్లగా అతి తక్కువ విస్తీర్ణంలో గిరిజన రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో దేశవాళి రకాల వేరుశనగను సాగుచేస్తున్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 1,980 వేల హెక్టార్లు మాత్రమే వేరుశనగ సాగు చేస్తున్నారు. రైతులు సాగుచేస్తున్న వేరుశనగ ఎకరాకు కేవలం 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే ఇస్తుంది. దీంతో ఈ పంటను వాణిజ్యసరళిలో సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. గిరిజన ప్రాంతాల వాతావరణం, నేలలు వేరుశనగ సాగుకు అత్యంత అనుకూలమని పరిశోధన ద్వారా గుర్తించారు. దీంతో గిరిజన రైతులతో వేరుశనగను వాణిజ్య సరళిలో సాగుచేసేలా ప్రోత్సహించేందుకు నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందజేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. గత ఏడాది చింతపల్లిలో గిరిజనుల వ్యవసాయంపై శాస్త్రవేత్తలు నిర్వహించిన జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు, నిపుణులు అత్యధిక దిగుబడి, గింజ పెద్ద పరిమాణంలోనున్న కె-7బోల్డ్‌ రకం విత్తనం రైతులకు అందజేయడంతోపాటు సాగు విస్తీర్ణం పెంపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. కే-7బోల్డు రకం నూతన వంగడాలపై పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించారు. దీంతో ఈ రకం విత్తనం ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి మినీ కిట్ల రూపంలో పంపిణీచేసి సాగును విస్తరింపజేసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.

అధిక దిగుబడి

నూతన వేరుశనగ రకాలు కె-7బోల్డ్‌ ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం రైతులు సాగుచేస్తున్న దేశవాళి రకాలు కనీసం ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. ఈ నూతన విత్తనాలను రైతులు సాగుచేసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మార్కెట్‌లో అధిక డిమాండ్‌

నూతన రకాలైన కె-7 బోల్డ్‌ రకాలకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ లభిస్తుంది. గింజ పరిమాణం సాధార గింజలకంటే రెట్టింపు ఉంటుంది. ఈ గింజల్లో దాదాపు 75 శాతానికిపైగా నూనె కలిగి వుంటుంది. ఈ నూతన రకాల్లో పోషకవిలువలు కూడా సాధాన గింజలకంటే రెట్టింపు వున్నాయి. చీడపీడలు ఆశించడం లేదు. ఒక మొక్క నుంచి కనీసం అర కిలోకుపైగా దిగుబడి వస్తుంది. కాయ పరిమాణం కూడా పెద్దగా వుండడంతో ఈ గింజలకి మార్కెట్‌లో కిలో రూ.200కి పైగా ధర లభిస్తుంది.

కదిరి లేపాక్షిపై పరిశోధన

పరిశోధన స్థానంలో వేరుశనగలో అత్యధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘కదిరి లేపాక్షి’పై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మక సాగులో ఎకరాకి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్టు గుర్తించారు. ఈ రకం ప్రధానంగా తెగుళ్లు, చీడపీడలను తట్టుకుంటుంది. గింజల్లో 51 శాతం నూనె ఉంటుంది. ప్రయోగాత్మక సాగులో శాస్త్రవేత్తలు ఉత్తమ ఫలితాలు సాధించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:48 AM