గిరిజన ప్రాంతంలో సేవలందించడం అదృష్టం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:38 AM
గిరిజన ప్రాంతంలో సేవలందించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ ఎం.విజయసునీత అన్నారు. ఆమె బదిలీ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

- కలెక్టర్ ఎం.విజయ సునీత
పాడేరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో సేవలందించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ ఎం.విజయసునీత అన్నారు. ఆమె బదిలీ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అందరి సహకారంతో పక్కా వ్యూహంతో ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించామన్నారు. మోదకొండమ్మ ఆశీస్సులతో జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నాలుగు నెలలు అధికారులతో పని చేశానని, ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలందించలేకపోయానన్నారు. రాజకీయ పార్టీల నేతలు, విలేకరులు చక్కని సహకారం అందించారన్నారు. ఎన్నికల నేపఽథ్యంలో సామాజిక పింఛన్లు, వైద్యపరమైన సేవల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామన్నారు. జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు ఎన్నికల సమయంలో చక్కని సహకారం అందించారని, మోదకొండమ్మ ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించగలిగారన్నారు. జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ఠ, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే, రంపచోడవం సబ్కలెక్టర్ ప్రశాంత్కుమార్, పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి.. కలెక్టర్ విజయసునీత సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు జ్ఞాపికలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఆర్డీవో చైతన్య, ఏఎస్పీ కె.ధీరజ్, డీఆర్వో బి. పద్మావతి, ఎస్డీసీలు వీవీఎస్.శర్మ, భవాని, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్ఎం.రాజు, డీఆర్డీఏ పీడీ వి.మురళి, డీఎంహెచ్వో సి.జమాల్భాషా, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.