తాగునీటికి కటకట
ABN , Publish Date - May 21 , 2024 | 12:20 AM
అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధి ఎగువ గుడ్డి గ్రామస్థులకు మంచినీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ఊటల నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు.
![తాగునీటికి కటకట](https://media.andhrajyothy.com/media/2024/20240511/20ark2_b12b91425b.jpg)
ఎగువ గుడ్డి గ్రామస్థులకు ఊటనీరే దిక్కు
అలంకారప్రాయంగా మంచినీటి పథకం
మంచినీటి సౌకర్యం కల్పించాలని ఖాళీ బిందెలతో నిరసన
అరకులోయ, మే 20: అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధి ఎగువ గుడ్డి గ్రామస్థులకు మంచినీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ఊటల నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తమకు తాగునీటి వసతి కల్పించాలని సోమవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద కొళాయిలు ఏర్పాటు చేసినా చుక్కనీరు రావడం లేదు. దీంతో పురుషులు, మహిళలు బిందెలు, కావిళ్లతో గ్రామానికి దూరంగా ఉన్న ఊటల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. తమ సమస్యను అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని గిరిజన సహకార సంఘం నాయకులు కె.సింహాచలం, కోటపర్తి సన్యాసిరావు, పొట్టంగా సన్యాసమ్మతో పాటు గ్రామస్థులు చెప్పారు.