ఘాట్రోడ్డు ప్రయాణమంటే హడల్
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:03 PM
అనంతగిరి, గంట్యాడ మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎగువకొండపర్తి గ్రామంలోని కొండపై నిర్మించిన అనంత వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధికంగా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ ఘాట్ రోడ్డులో ప్రమాదకర మలుపులు ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎన్ఆర్పురం రోడ్డులో తరచూ ప్రమాదాలు
ప్రమాదకర మలుపులు ఉండడమే కారణం
దైవ దర్శనానికి వచ్చి ప్రమాదానికి గురైన వారెందరో..
అప్రమత్తమైన పోలీస్ శాఖ
జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు సూచనలు
అనంతగిరి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి, గంట్యాడ మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎగువకొండపర్తి గ్రామంలోని కొండపై నిర్మించిన అనంత వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధికంగా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ ఘాట్ రోడ్డులో ప్రమాదకర మలుపులు ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
కాశీపట్నం నుంచి ఎన్ఆర్పురం మీదుగా ఎగువకొండపర్తి వరకు ఘాట్రోడ్డు ప్రయాణం సాగుతుంది. 18 కిలో మీటర్ల ఈ ఘాట్ రోడ్డులో 36 మలుపులు ఉన్నాయి. అనంత వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణంతో వాహనాల రద్దీ పెరిగింది. 2013-15లో కాశీపట్నం నుంచి ఎన్ఆర్పురం వరకు 8.5 కిలో మీటర్ల గాను రూ.3.10 కోట్లతో తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. 2019-20లో ఎన్ఆర్పురం నుంచి ఎగువకొండపర్తి వరకు 8.5 కిలో మీటర్లకు గాను రూ.4.73 కోట్లతో పంచాయతీరాజ్ అధికారులు తారురోడ్డును నిర్మించారు. అయితే ఎక్కువ మలుపులు ఉండడంతో ఈ మార్గంలో కొత్తగా ప్రయాణించేవారికి అవగాహన లేక ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ నెలలో జరిగిన కొన్ని ప్రమాదాలు
- ఈ నెల 10న కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన 20 మంది భక్తులు వ్యాన్లో అనంత వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి తిరిగి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వ్యాన్ బోల్తా పడడంతో ఓ యువకుడు మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- ఈ నెల 20న భీమిలికి చెందిన కొంతమంది భక్తులు ఆలయానికి ఆటోలో వచ్చారు. తిరిగి వెళుతుండగా ఎన్ఆర్పురం ఘాట్రోడ్డు వద్ద ఆటో బోల్తా పడింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- ఈ నెల 20న గంట్యాడ మండలం మురపాక గ్రామానికి వెంకటరమణ, తన భార్య దేవి, కుమార్తె పల్లవితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇక్కడి ఆలయానికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డు వద్ద బ్రేక్ఫెయిల్ కావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయి మృతి చెందింది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూ పలువురు గాయపడుతున్నారు.
పోలీసులు అప్రమత్తం
అనంత వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇటీవల ప్రమాదాలకు గురికావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్ఆర్పురం వెళ్లే రోడ్డులో కాశీపట్నం వద్ద పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచి, ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాలు కండీషన్లో ఉండాలని, వ్యాన్లో పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని అనంతగిరి ఎస్ఐ డి.శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మలుపుల వద్ద మీతిమిరిన వేగంతో ప్రయాణించవద్దని అవగాహన కల్పిస్తున్నారు.