ఘాటీ దిగాలంటే గండమే!
ABN , Publish Date - Oct 07 , 2024 | 11:46 PM
ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన చోదకులు ఘాట్ దిగాలంటే గండంగా మారింది.
ఆప్టికల్ కేబుల్ గోతులు సరిగా పూడ్చక అవస్థలు
ఘాట్లో రాకపోకలకు వాహన చోదకుల ఇబ్బందులు
గోతుల మట్టిని సరిచేయకుంటే
ప్రమాదాలు తప్పవని డ్రైవర్ల ఆందోళన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన చోదకులు ఘాట్ దిగాలంటే గండంగా మారింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు తవ్విన గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది. దీంతో ప్రమాదాలకు గురవుతున్నామని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలోని బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించేందుకు మైదాన ప్రాంతం నుంచి పాడేరుకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఘాట్రోడ్డుకు ఒక వైపు గోతులు తవ్వి దానిలో కేబుల్ వేస్తున్నారు. అయితే కేబుల్ వేసిన తర్వాత ఆయా గోతులను సక్రమంగా పూడ్చడం లేదు. రోడ్డుపైనే చాలా వరకు మట్టి ఉండిపోతోంది. దీంతో ఘాట్లో ఎదురెదురుగా వాహనాలు తప్పుకోవడానికి డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. అలాగే వర్షం కురిస్తే ఈ సమస్య మరింత జఠిలమవుతున్నది. వర్షానికి మట్టి మొత్తం బురదమయం కావడంతో వాహనాలు జారిపోయి పక్కన ఉన్న గోతుల్లో కూరుకుపోతున్నాయని డ్రైవర్లు తెలిపారు. అలాగే ఆదివారం ఘాట్లో భారీ వర్షం కురవడం, ట్రాఫిక్ అధికంగా ఉండడంతో ఘాట్లో రాకపోకలకు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి కేబుల్ కోసం తవ్విన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాని కాంట్రాక్టర్ ఆయా గోతులను సగమే పూడ్చడంతోపాటు మట్టి రోడ్డుపైకి రావడంతో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పాడేరులోని మోదకొండమ్మను దర్శించుకుని తిరుగుప్రయాణమైన భవానీ భక్తుల వాహనం 12వ మైలు ప్రాంతంలో ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్ మార్గంలో కేబుల్ గోతులు పూడ్చే విషయంలో అప్రమత్తమై.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు.