చింతపల్లి, జీకేవీధిల్లో కుండపోత
ABN , Publish Date - Jun 24 , 2024 | 11:38 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, అరకులోయ మండలాల్లో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
వాగులను తలపించిన రోడ్లు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
అరకులోయలో మోస్తరు వర్షం
వ్యవసాయ పనులకు ఎంతో మేలు
గూడెంకొత్తవీధి/చింతపల్లి/అరకులోయ, జూన్ 24: అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, అరకులోయ మండలాల్లో సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. వర్షంతో రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, చెరువుల్లో వర్షపు నీరు చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అరగంట సేపు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మబ్బుగా ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షంతో దుక్కులు చేసుకుని నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం కావాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.