ఎక్కడ చూసినా చెత్తే!
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:39 AM
మునిసిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం రోజు రోజుకీ క్షీణిస్తున్నది. వీధుల్లో చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. నర్సీపట్నం, అనకాపల్లిల్లో పారిశుధ్య కార్మికులు పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. నర్సీపట్నంలో ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పది రోజుల్లో ఒక్కసారి కూడా చెత్తను తొలగించకపోవడంతో కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నదని, పరిస్థితి ఇలాగే వుంటే అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
![ఎక్కడ చూసినా చెత్తే!](https://media.andhrajyothy.com/media/2023/20231205/4np4_8ee5a21a94.jpg)
కార్మికుల సమ్మెతో క్షీణిస్తున్న పారిశుధ్యం
కంపుకొడుతున్న పట్టణాలు
అనకాపల్లి, నర్సీపట్నంలో పది రోజుల నుంచి పేరుకుపోతున్న చెత్త కుప్పలు
ఎలమంచిలిలో రెండో రోజుకు చేరిన సమ్మె లోపిస్తున్న
అనకాపల్లి టౌన్/ నర్సీపట్నం/ ఎలమంచిలి, జనవరి 4: మునిసిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం రోజు రోజుకీ క్షీణిస్తున్నది. వీధుల్లో చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. నర్సీపట్నం, అనకాపల్లిల్లో పారిశుధ్య కార్మికులు పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. నర్సీపట్నంలో ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పది రోజుల్లో ఒక్కసారి కూడా చెత్తను తొలగించకపోవడంతో కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నదని, పరిస్థితి ఇలాగే వుంటే అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో పూడిక పేరుకుపోయి దోమల బెడద అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. కాగా సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. అబీద్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. అనకాపల్లిలో సగం మంది రెగ్యులర్ కార్మికులు విధుల్లో వుండడంతో ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. వీధుల్లో చెత్తను తొలగించడంలేదు. కాగా పట్టణంలో సేకరించిన చెత్తను జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్దకు తరలించి, ఇక్కడి నుంచి డంపర్ల ద్వారా కాపులుప్పాడ పంపుతుంటారు. కానీ బుధవారం రాత్రి సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు డంపర్ లారీలను అడ్డుకోవడంతో చెత్త తరలింపు ఆగింది.
ఎలమంచిలిలో..
ఎలమంచిలి మునిసిపాలిటీలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. మునిసిపాలిటీలో మొత్తం 92 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారిశుధ్య సిబ్బంది వుండగా వీరిలో 78 మంది సమ్మె చేస్తున్నారు. దీంతో వీధుల్లో చెత్త తొలగించకపోవడంతో గుట్టలుగా పేరుకుపోతున్నది. పట్టణంలో రోజూ సుమారు 16 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకి తరలిస్తుంటారు. రెండు రోజుల నుంచి 85 శాతం మంది పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడంతో మిగిలిన 12 మంది మెయిన్ రోడ్డు, మార్కెట్ వీధుల్లో మాత్రమే పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతున్నది. ఇంటింట చెత్త సేకరణ నిలిచిపోవడంతో ఇళ్లలో చెత్త డబ్బాలు నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు వీధుల్లో, డంపర్ బిన్ల వద్ద చెత్తను పడేస్తున్నారు. ఇది కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది.