Share News

జీడిమామిడి రైతుకు ఎన్నికల కోడ్‌ దెబ్బ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:40 AM

ఎన్నికల కోడ్‌ ప్రభావం జీడి పిక్కల ధరలపై పడింది. జీడి పిక్కలకు, ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటి అన్న అనుమానం వస్తున్నదా? ఇది ముమ్మాటికీ నిజం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లడానికి వీలులేదు. ఒక వేళ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాల్సి వస్తే.. తనిఖీ అధికారులకు తగిన ఆధారాలు చూపాల్సి వుంటుంది. దీంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడానికి వీలుకాక, జీడి పిక్కల కొనుగోలుకు ముందుకు రావడంలేదు.

జీడిమామిడి రైతుకు ఎన్నికల కోడ్‌ దెబ్బ
పొలంలో ఆరబెట్టిన జీడి పిక్కలు

నగదు రవాణాపై ఆంక్షలతో పిక్కల కొనుగోలుకు ముందురాని ఇతర రాష్ట్రాల వ్యాపారులు

ఇదే అదనుగా ధరలు తగ్గించేసిన దళారులు

క్వింటా రూ.9 వేలకు పతనం

గత ఏడాది రూ.12 వేలు పలికిన ధర

రావికమతం, ఏప్రిల్‌ 18: ఎన్నికల కోడ్‌ ప్రభావం జీడి పిక్కల ధరలపై పడింది. జీడి పిక్కలకు, ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటి అన్న అనుమానం వస్తున్నదా? ఇది ముమ్మాటికీ నిజం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లడానికి వీలులేదు. ఒక వేళ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాల్సి వస్తే.. తనిఖీ అధికారులకు తగిన ఆధారాలు చూపాల్సి వుంటుంది. దీంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడానికి వీలుకాక, జీడి పిక్కల కొనుగోలుకు ముందుకు రావడంలేదు. మరోవైపు తోటల్లో సేకరించిన జీడి పిక్కలను ధర తగ్గించి అయినా అమ్ముకోవడానికి రైతులు సిద్ధపడాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లాలో సుమారు 50 వేల హెక్టారుల్లో జీడిమామిడి తోటలు వున్నాయి. ఇంచుమించుగా అన్ని మండలాల్లో రైతులు జీడిమామిడిని సాగు చేస్తున్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తోటల్లో పూత ఆలస్యంగా వచ్చింది. పూత వచ్చే సమయానికి అధిక చలితోపాటు మంచు దట్టంగా కురవడంతో టీ దోమ తెగులు విజృంభించింది. దీంతో చాలా వరకు పూత, పందెలు మాడిపోయాయి. తరువాత కాయ తొలుచు పురుగు, పేనుబంక పురుగు సోకవడంతో దిగుబడి మరింత తగ్గింది. కాపు బాగా కాస్తే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు జీడి పిక్కల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది మూడు నాలుగు క్వింటాళ్లకు మించి రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి జీడి పిక్కలను సేకరించి ఎండ బెడుతున్నారు. తొలివిడత సేకరించిన జీడి పిక్కలను విక్రయించాలని భావిస్తుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు రావడంలేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా అధిక మొత్తంలో నగదు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. దీంతో స్థానిక వ్యాపారులు (దళారులు) జీడిపిక్కల ధరలను అమాంతం తగ్గించేశారు. క్వింటా రూ.9 వేలకు మించి కొనుగోలు చేయడలేదు. గత ఏడాది క్వింటా జీడి పిక్కలు రూ.11-12 వేల వరకు కొనుగోలు చేశారని, ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినందున గిరాకీ ఏర్పడి క్వింటా రూ.12 వేలకు పైబడి ధర పలుకుతుందని రైతులు ఆశించారు. కానీ ఎన్నికల కోడ్‌ తమ ఆశలను ఆవిరి చేసిందని జీడిమామిడి రైతులు వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడి పిక్కలు కోనుగోలు చేయించి రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క ఏడాది కూడా దీనిని అమలు చేయలేదని రైతులు గుర్తు చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:41 AM