ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:22 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులను కలెక్టర్ కె.విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్/ తుమ్మపాల, జూలై 8: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులను కలెక్టర్ కె.విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదీలతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు ఆయా శాఖల పరిధిలో గల సమస్యలపై 303 అర్జీలు అందాయని చెప్పారు. అత్యధికంగా రెవెన్యూ డిపార్టుమెంట్కు 168, ల్యాండ్ రికార్డు సర్వే శాఖకు 25, పోలీస్శాఖకు 25, పంచాయతీరాజ్శాఖకు 20, ఆరోగ్యశాఖకు 10, మునిసిపల్ అడ్మినిస్ర్టేటివ్కు ఏడు, రూరల్ డెవలప్మెంట్శాఖకు ఆరు, విద్యా, సోషల్ వెల్ఫేర్, విద్యుత్, కో- ఆపరేటివ్ సొసైటీ శాఖలకు నాలుగేసి చొప్పున, సివిల్ సప్లయీస్, ఆర్డబ్ల్యూఎస్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ శాఖలకు మూడేసి చొప్పున, వాటర్ రీసోర్స్, మైన్స్, పొల్యూషన్ శాఖలకు రెండేసి చొప్పున, సీనియర్ సిటిజన్స్, మత్స్యకార, ఎన్ఈపీఎన్ఏ, ఆర్ అండ్ బీ, రిజిస్ర్టేషన్, ఎక్సైజ్, పంచాయతీరాజ్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందాయని ఆమె చెప్పారు. సకాలంలో అర్జీలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు.