Share News

క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:15 AM

ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి స్థానిక ఉషాఫ్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ ఎం.దీపిక శుక్రవారం పరామర్శించారు.

క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ
క్షతగాత్రునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ దీపిక

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 23 : ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి స్థానిక ఉషాఫ్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ ఎం.దీపిక శుక్రవారం పరామర్శించారు. ఆస్పత్రిలోని వైద్యం పొందుతున్న ప్రతి ఒక్కరిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కలిసి కలెక్టర్‌ మనోధైర్యం కల్పించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలను డాక్టర్‌ అవినాష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడుతూ సంఘటనపై ఏపీఐఐసీ, బ్రాయిలర్‌, ఫైర్‌, పరిశ్రమల తదితర జిల్లా అధికారులతో సమీక్షించామన్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల భద్రతపై చర్యలు చేపడతామన్నారు. సంఘటనలో మృతి చెందిన 17 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున చెక్కులు అందించామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో చిన్నికృష్ణ, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, డీటీ శ్రీరామ్మూర్తి, డాక్టర్‌ అవినాష్‌, అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:15 AM