నో ఫ్లయింగ్ జోన్గా కౌంటింగ్ సెంటర్లు
ABN , Publish Date - May 22 , 2024 | 11:39 PM
పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిర్వహించే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ(కౌంటింగ్ సెంటర్లు) నో ఫ్లయింగ్ జోన్గా నిర్ధారించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు.
![నో ఫ్లయింగ్ జోన్గా కౌంటింగ్ సెంటర్లు](https://media.andhrajyothy.com/media/2024/20240511/22pdr1_aef729f019.jpg)
డ్లోన్లు, ఇతర చిత్రీకరణ నిషేధం
కలెక్టర్ విజయసునీత
ఎస్పీ, ఆర్వోలతో కలిసి స్ర్టాంగ్రూమ్ల తనిఖీ
పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిర్వహించే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ(కౌంటింగ్ సెంటర్లు) నో ఫ్లయింగ్ జోన్గా నిర్ధారించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు చెందిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను బుధవారం ఆమె ఇద్దరు రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్లను నో ఫ్లయింగ్ జోన్గా నిర్ధారించిన నేపథ్యంలో వాటిపై ఎటువంటి డ్రోన్లు ఎగురవేయకూడదని, ఆ ప్రాంతాల్లో ఎటువంటి వీడియో; ఫొటోల చిత్రీకరణ జరగకూడదన్నారు. ఈ విషయంలో నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలను రిటర్నింగ్ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్లకు వివరించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, అపోహలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
స్ర్టాంగ్ రూమ్ల తనిఖీ
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్ ఈవీఎంలను భద్రపరిచిన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్లను బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల భద్రత విషయంలో పక్కాగా వ్యవహరించాలని, స్ట్రాంగ్ రూమ్ల వైపు అనుమతిలేని వ్యక్తులను రానీయకూడదని భద్రతా సిబ్బందికి సూచించారు. అలాగే కౌంటింగ్ నిర్వహించే రోజు వరకు పటిష్ఠ భద్రతా చర్యలు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ కె.ధీరజ్ పాల్గొన్నారు.