Share News

నేటి నుంచి స్టీల్‌ప్లాంటులో బయోమెట్రిక్‌

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:45 AM

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం గురువారం నుంచి ఉద్యోగులు, కార్మికుల హాజరును పూర్తిగా బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవడానికి ఏర్పాట్లుచేసింది.

నేటి నుంచి స్టీల్‌ప్లాంటులో బయోమెట్రిక్‌

వ్యతిరేకిస్తున్న కార్మికులు

వేతన సవరణతో పాటు సమస్యలు పరిష్కరించిన తరువాతే అమలు చేయాలని డిమాండ్‌

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం గురువారం నుంచి ఉద్యోగులు, కార్మికుల హాజరును పూర్తిగా బయోమెట్రిక్‌ ద్వారా తీసుకోవడానికి ఏర్పాట్లుచేసింది. దీనికి అధికార వర్గాలు అంగీకరించినా, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉన్నా...ఆది నుంచి కొన్ని దశాబ్దాలుగా ఇంకో అరగంట అదనంగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి అదనపు మొత్తాలు ఇవ్వడం లేదు. అయితే కొంతమంది రికార్డులో సంతకం చేసి బయటకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాంటులో లోపాలన్నీ సవరించి, సక్రమంగా నడపాలనే ధ్యేయంతో యాజమాన్యం బయోమెట్రిక్‌ హాజరుకు పట్టుబడుతోంది. ఇందుకోసం 600 అటెండెన్స్‌ పరికరాలను కూడా సిద్ధం చేసింది. ప్లాంటులో అధికారులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు మొత్తం 29 వేల మంది ఉన్నారు. అధికారులు బయోమెట్రిక్‌కు ఒప్పుకున్నా కార్మికులు అంగీకరించడం లేదు. తమకు వేతన సవరణతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన తరువాతే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల పర్సనల్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. సీఎండీని కూడా ఘెరావ్‌ చేశారు. అయినా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం నుంచి అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 01:45 AM