ఏయూ అచీవర్స్ డే రద్దు
ABN , Publish Date - Apr 26 , 2024 | 01:01 AM
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఎన్నికల సమయంలో నిర్వహించ తలపెట్టిన ‘అచీవర్స్ డే’కు జాయింట్ కలెక్టర్ అశోక్ అడ్డుకట్ట వేశారు.
ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంగా ఎందుకు చెప్పలేదని ఏయూ అధికారులను ప్రశ్నించిన జేసీ
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఎన్నికల సమయంలో నిర్వహించ తలపెట్టిన ‘అచీవర్స్ డే’కు జాయింట్ కలెక్టర్ అశోక్ అడ్డుకట్ట వేశారు. ఏయూలో పలువురు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాగా వారితో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 1,400 మందితో బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ‘అచీవర్స్ డే’ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సమయంలో ఇలా ఓటు హక్కు కలిగిన వారిని పెద్ద సంఖ్యలో సమావేశ పరిచి, ప్రభుత్వ అధికారులు ప్రసంగాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా సరే ఏయూ పెద్దలు దీనికి నడుం కట్టారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా, తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఎన్నికల అధికారులు కార్యక్రమం మొత్తం నిఘా కెమెరాలతో చిత్రీకరిస్తారని, తప్పుడు వార్తలు ప్రచురించారంటూ ఖండించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే నిర్వహించాలని యత్నించి, ఎన్నికల సంఘం ఆదేశాలతో విరమించుకున్నారని, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ గురువారం మరో కథనం ప్రచురించడంతో జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ స్పందించారు. తనకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత విషయం ఎందుకు చెప్పలేదని ఏయూ అధికారులను ప్రశ్నించారు. సాధారణ సమావేశం అని చెప్పడం వల్లే అనుమతి ఇచ్చామని, తప్పుడు సమాచారం ఇచ్చినందున అనుమతి రద్దు చేయాలని సంబంధిత ప్రాంతపు ఎన్నికల అధికారిని ఆదేశించారు. దాంతో శుక్రవారం నిర్వహించాల్సిన అచీవర్స్ డే రద్దయింది.