పెదగోగాడ గెడ్డలో పడి ఆర్మీ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:47 PM
బైక్పై వెళుతున్న ఆర్మీ ఉద్యోగి ప్రమాదవశాత్తు గెడ్డలోపడి మృతి చెందినట్టు ఎస్ఐ జి.నారాయణరావు తెలిపారు.
చీడికాడ, ఏప్రిల్ 17 : బైక్పై వెళుతున్న ఆర్మీ ఉద్యోగి ప్రమాదవశాత్తు గెడ్డలోపడి మృతి చెందినట్టు ఎస్ఐ జి.నారాయణరావు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన కథనం ప్రకారం వివరాలివి. బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం గ్రామానికి చెందిన పడాల వరహాలు (32) హైదరాబాద్లోని ఆర్మీలో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి విచ్చేశారు. మంగళవారం సాయంత్రం అత్తవారి గ్రామం అయిన దేవరాపల్లి మండలం వాకపల్లి వెళ్లేందుకు వరహాపురం మీదుగా పెదగోగాడ రోడ్డులో బైక్పై వెళుతున్నారు. అయితే పెదగోగాడ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో బైక్ అదుపుతప్పి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారని ఎస్ఐ వివరించారు. బుధవారం సాయంత్రం పశువులు మేపుతున్న పెదగోగాడకు చెందినవారు మృతదేహాన్ని చూసి తమకు ససమాచారం అందించారన్నారు. దీంతో ఏఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. బుధవారం రాత్రి మృతుడి తండ్రి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే, వరహాలుకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య, రెండేళ్ల బాలుడు ఉన్నారు.