అన్ని హోర్డింగులూ వైసీపీకేనా?
ABN , Publish Date - Apr 26 , 2024 | 01:14 AM
జిల్లాలో ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేస్తున్నదా? లేదా? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
బస్టాప్లలో కొనసాగుతున్న ‘నవరత్నాల’ ప్రచారం
ఎన్నికల సంఘం గుర్తించదా..?
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేస్తున్నదా? లేదా? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నగరంలో జాతీయ రహదారితో పాటు ప్రధాన రహదారుల్లో హోర్డింగులపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పోస్టర్లే కనిపిస్తున్నాయి. ప్రైవేటు స్థలాలైనా, ప్రభుత్వ స్థలాలైనా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటే...వాటిని సమానంగా అన్ని పార్టీలకు కేటాయించాలని ఎన్నికల సంఘం ఓ నిబంధన పెట్టింది. జిల్లా ఎన్నికల అధికారి కూడా ఈ విషయం అనేకసార్లు స్పష్టంచేశారు. కానీ విశాఖపట్నంలో ఆ పరిస్థితి లేదు. నగరంలోని హోర్డింగులపై అత్యధిక శాతం వైసీపీ ప్రచారమే కనిపిస్తోంది. మిగిలిన వాటిలో వాణిజ్య ప్రకటనలు ఉంటున్నాయి. ఇతర పార్టీలకు ప్రచారానికి అవకాశమే ఇవ్వడం లేదు. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?...అని ఇతర పార్టీల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అలాగే జాతీయ రహదారిపై గల అనేక బస్టాప్లలో సైతం నవరత్నాల ప్రచారం (గ్లోసైన్ బోర్డులు) కొనసాగుతోంది. ఎన్నికల పర్యవేక్షణ అధికారులు మరి ఏం చేస్తున్నారో?