వేడెక్కుతున్న అంగన్వాడీల సమ్మె
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:27 AM
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో వారు తమ నిరసనను తెలియజే స్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అంగన్వాడీలు శనివారం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షా శిబిరం సమీపంలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు.
నిరవధిక నిరాహార దీక్షలకు శ్రీకారం
ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళనను విరమించబోమని స్పష్టీకరణ
పెందుర్తి, జనవరి 6: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు తీవ్రతరంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో వారు తమ నిరసనను తెలియజే స్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అంగన్వాడీలు శనివారం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షా శిబిరం సమీపంలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిఽధిలో పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ మండలాలకు చెందిన అంగన్వాడీలు అధిక సంఖ్యలో దీక్షా శిబిరానికి తరలివచ్చారు. తొలిరోజు తొమ్మిది మంది అంగన్వాడీలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభు త్వం అంగన్వాడీల గొంతు నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీలు సమ్మె చట్ట విరుద్ధమని ఎస్మా కింద శనివారం ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రులను దహనం చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో పత్రులతో హక్కులను కాలరాసిందంటూ నోటీసు ప్రతులను కాళ్ల కింద తొక్కిపెట్టి చూపిస్తూ.. ఇదేవిధంగా ప్రభుత్వాన్ని కాలకింద తొక్కేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.దేవి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.అనిత, అధ్యక్షురాలు బృంద, తదితరులు పాల్గొన్నారు
దీక్షా శిబిరం వద్దే నిద్ర..
ఇక్కడి అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు దిగిన అంగన్వాడీలు శనివారం రాత్రి దీక్షా శిబిరం వద్దే నిద్రించారు. జగన్ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తాము దీక్షలను విరమించేదే లేదని, అవసరమైతే అమరణ నిరాహార దీక్షలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి న్యాయసమ్మతమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.