నీళ్ల తొట్టెలో పడి 18 నెలల బాలుడి మృతి
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:06 AM
ఏడాదిన్న వయసున్న బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి మృతిచెందాడు. మండలంలోని వాలాబు శివారు కోడాపల్లిలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
![నీళ్ల తొట్టెలో పడి 18 నెలల బాలుడి మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240313/21dvp1_96841307fa.jpg)
కోడాపల్లి గిరిజన గ్రామంలో ఘటన
దేవరాపల్లి, మార్చి 21: ఏడాదిన్న వయసున్న బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి మృతిచెందాడు. మండలంలోని వాలాబు శివారు కోడాపల్లిలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
వాలాబు పంచాయతీ కోడాపల్లి గిరిజన గ్రామానికి చెందిన చెరకు చంద్రరావు, జానకి భార్యాభర్తలు. వీరిలో 18 నెలల వయసున్న కుమారుడు (గణేశ్) వున్నాడు. గురువారం సాయంత్రం బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తరువాత బాలుడి అలికిడి లేకపోవడంతో జానకి ఇంటి నుంచి బయటకు వచ్చి చూసింది. కుమారుడు నీళ్ల తొట్టెలో మునిగి వుండడాన్ని గమనించి వెంటనే భర్తకు చెప్పింది. బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై దేవరాపల్లి పీహెచ్సీకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే మృతిచెందాడని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో భార్యాభర్తలు కన్నీరుమున్నీరు అవుతూ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.