అచ్యుతాపురంలో కూటమి హవా
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:15 AM
వైసీపీకి కంచుకోటగా భావించే అచ్యుతాపురం మండలంఈ సారి ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచింది. ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు ఏకంగా 15వేలకు పైగా ఆధిక్యతను కట్టబెట్టింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు బెదిరింపులు, అకృత్యాలకు మండలంలోని మొత్తం 34 పంచాయతీల్లో ఏకంగా 32 పంచాయతీల ప్రజలు చెక్ పెట్టారు. కేవలం రెండు పంచాయతీల్లో అదీ అతి స్వల్ప మెజారిటీ మాత్రమే కన్నబాబురాజుకు దక్కింది.
![అచ్యుతాపురంలో కూటమి హవా](https://media.andhrajyothy.com/media/2024/20240604/atchutapuram_view_6ffa7888ca.jpg)
32 పంచాయతీల్లో జనసేనకు ఆధిక్యం
మూడో వంతు మెజారిటీ అందించిన ప్రజలు
సుందరపు విజయంలో కీలకంగా మారిన మండలం
అచ్యుతాపురం, జూన్ 7:
వైసీపీకి కంచుకోటగా భావించే అచ్యుతాపురం మండలంఈ సారి ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచింది. ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు ఏకంగా 15వేలకు పైగా ఆధిక్యతను కట్టబెట్టింది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు బెదిరింపులు, అకృత్యాలకు మండలంలోని మొత్తం 34 పంచాయతీల్లో ఏకంగా 32 పంచాయతీల ప్రజలు చెక్ పెట్టారు. కేవలం రెండు పంచాయతీల్లో అదీ అతి స్వల్ప మెజారిటీ మాత్రమే కన్నబాబురాజుకు దక్కింది.
ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలో రాంబిల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి, మునగపాక మండలాలున్నాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ 48,956 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇందులో కేవలం అచ్యుతాపురం మండలం నుంచే 15,344 ఓట్ల ఆధిక్యత లభించింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజుకు అనేక పంచాయతీలు అండగా నిలిచాయి. దీనికితోడు గెలిచిన తరువాత కన్నబాబు రాజు జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడంతో పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుదారులుగా రంగంలోకి దిగేందుకు కూడా చాలామంది భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మండలంలోని 34 పంచాయతీల్లో ఐదు పంచాయతీలు, 320 వార్డులకు గాను 89 వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఆరు పంచాయతీల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. ఇందులో గొర్లె ధర్మవరం సర్పంచ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక వైసీపీలో చేరిపోయారు. ఇక మండలంలోని 21 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాలను కూడా వైసీపీ అభ్యర్ధులే గెలుచుకున్నారు.
జనసేనకు అండగా...
తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పంచాయతీలుగా పేర్గాంచిన అనేకచోట్ల జనసేనకు భారీగా మెజారిటీ లభించింది. మండలం కేంద్రమైన అచ్యుతాపురంలో జనసేనకు 466 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇక్కడ 1,136 ఓట్లు పోలవగా వైసీపీకి కేవలం 306 ఓట్లు వచ్చాయి. జనసేనకు 1,136 ఓట్లు పోలయాయి. హరిపాలెంలో 339, అందలాపల్లిలో 457, దుప్పితూరులో 223, మడుతూరులో 733, మోసయ్యపేటలో 405, చోడపల్లిలో 857, కొండకర్లలో 419, చీమలాపల్లిలో 394, నునపర్తిలో 432, ఖాజీపాలెంలో 251, తిమ్మరాజుపేటలో 177, ఎర్రవరంలో 108, ఉప్పవరంలో 97, మల్లవరంలో 27, ఆవసోమవరంలో 323, దొప్పెర్లలో 621, జడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు తమ్ముడు, సర్పంచ్ పైడికొండ స్వగ్రామం భోగాపురంలో జనసేనకు 169 ఓట్ల ఆధిక్యం లభించింది. పూడిలో 310, గొర్లె ధర్మవరంలో 255, వెదురువాడలో 173, చిప్పాడలో 110, దోసూరులో 587, రాజాన పాలెంలో 360, తంతడిలో 312 ఓట్లు జనసేనకు మెజారిటీ వచ్చాయి. ఇక మండలంలో అతిపెద్ద పంచాయతీలైన పూడిమడకలో ఏకంగా 2,964, సెజ్ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో 2,515 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తమ్మీద అచ్యుతాపురం మండలంలో జనసేన అభ్యర్థికి 15,344 ఓట్లు మెజారిటీ లభించింది. కాగా ఇరువాడలో 59, జంగులూరులో 52 ఓట్లు మాత్రమే వైసీపీకి అధికంగా వచ్చాయి.