రూ.67కు కిలో కంది పప్పు
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:39 AM
చౌక డిపోల ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో సరుకులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు నుంచి బియ్యం, పంచదార, కందిపప్పు అందించనున్నది. ఇందుకోసం జిల్లాకు 552 టన్నుల కందిపప్పు, 238 టన్నుల పంచదార కేటాయించింది. కందిపప్పులో సగం ఇప్పటికే గోదాములకు చేరగా, డిపోలకు పంపించారు. మిగిలిన సరుకు నెలాఖరుకల్లా జిల్లాకు చేరనున్నది. పంచదార 238 టన్నులు గోదాములకు చేరిందని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రతి కార్డుదారుడికి రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార ఇస్తామన్నారు.
వచ్చే నెల నుంచి బియ్యం కార్డుదారులకు పంపిణీ
జిల్లాకు 552 టన్నులు కేటాయింపు
238 టన్నుల పంచదార కూడా...
అర కిలో రూ.17
గత ప్రభుత్వంలో అరకొర సరఫరాయే...
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
చౌక డిపోల ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో సరుకులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు నుంచి బియ్యం, పంచదార, కందిపప్పు అందించనున్నది. ఇందుకోసం జిల్లాకు 552 టన్నుల కందిపప్పు, 238 టన్నుల పంచదార కేటాయించింది. కందిపప్పులో సగం ఇప్పటికే గోదాములకు చేరగా, డిపోలకు పంపించారు. మిగిలిన సరుకు నెలాఖరుకల్లా జిల్లాకు చేరనున్నది. పంచదార 238 టన్నులు గోదాములకు చేరిందని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రతి కార్డుదారుడికి రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార ఇస్తామన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం, పంచదార కార్డుదారులందరికీ ఇచ్చేవారు. కందిపప్పు మాత్రం అరకొర సరఫరా చేయడంతో ఎండీయూ వాహనదారులను కార్డుదారులు నిలదీస్తుండేవారు. ఆ తరువాత (ఏడాది క్రితం) కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిపివేసి గోధుమ పిండి ఇవ్వడం మొదలెట్టారు. అది కూడా నాసిరకంగా ఉండడంతో కార్డుదారులు తీసుకునేవారు కాదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర పెరగడంతో రాయితీపై ఇవ్వాలని కార్డుదారులు కోరినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్టోబరు నెలకు జిల్లా డిమాండ్లో 20 నుంచి 30 శాతం కందిపప్పు కేటాయించినా, గోదాములకు అంతకంటే తక్కువ వచ్చింది. రెండో వారం నాటికి మరికొంత సరఫరా చేశారు. అయితే నవంబరు నుంచి పూర్తిస్థాయిలో కందిపప్పు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీతో పౌర సరఫరాల సంస్థలో చలనం వచ్చి మిల్లర్ల నుంచి కొనుగోలు చేసి మరీ జిల్లాలకు సరఫరా చేశారు. దీంతో కార్డుదారులందరికీ కందిపప్పు, పంచదార అందిస్తామని డీలర్లు చెబుతున్నారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.180 వరకు ఉండగా కార్డుదారులకు రూ.67కు అందించనున్నారు. దీనికితోడు డీపావళి నుంచి ఉచిత సిలిండర్ పథకం ప్రారంభం కానున్నది. సోమవారం దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు రానున్నాయి.