మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:09 PM
మన్యంపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో శుక్రవారం ఉదయం పది గంటల వరకు ఎండ కాయని పరిస్థితి నెలకొంది.

పది గంటల వరకు పొగమంచే!
డుంబ్రిగుడలో 13.5, జి.మాడుగులలో 13.6 డిగ్రీలు
చలి ప్రభావానికి గజగజలాడుతున్న జనం
పాడేరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన్యంపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో శుక్రవారం ఉదయం పది గంటల వరకు ఎండ కాయని పరిస్థితి నెలకొంది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతుండడంతో చలి ప్రభావం చూపుతోంది. శుక్రవారం డుంబ్రిగుడలో 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలి తీవ్రతకు గిరిజనులు వణుకుతున్నారు. అలాగే శుక్రవారం ఉదయం పది గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అలాగే దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో పది గంటలు దాటే వరకు జనం సాధారణ జీవనం సాగంచలేకపోయారు. అలాగే గ్రామాల్లోని గిరిజనులు దుంగలతో చలి మంటలు వేసుకోగా, పలువురు ఉన్ని దుస్తులు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.
డుంబ్రిగుడలో 13.5 డిగ్రీలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. డుంబ్రిగుడలో శుక్రవారం 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. జి.మాడుగులలో 13.6, అరకులోయలో 14.3, హుకుంపేటలో 14.8, జీకేవీధిలో 15.1, పాడేరులో 15.4, అనంతగిరిలో 15.5, ముంచంగిపుట్టులో 15.6, పెదబయలులో 15.7, చింతపల్లిలో 15.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.