3 నుంచి టెట్
ABN , Publish Date - Sep 29 , 2024 | 01:40 AM
ఉమ్మడి జిల్లాలో వచ్చే నెల మూడో తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
21వ తేదీ వరకు నిర్వహణ
ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో ఎనిమిది కేంద్రాలు
60,574 మంది అభ్యర్థులు
పరీక్ష కేంద్రాల్లోకి అరగంట ముందు అనుమతి
పక్కాగా ఏర్పాట్లు
కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో వచ్చే నెల మూడో తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. టెట్ నిర్వహణపై శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఏడు కేంద్రాలు, అనకాపల్లి జిల్లాలో ఒక కేంద్రంలో ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మఽధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు మొత్తం 60,574 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఈనెల 22వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయని వివరించారు. ఫొటో లేని హాల్ టికెట్తో వస్తే తాజా పాస్పోర్టు ఫొటో తీసుకుని పరీక్షకు అనుమతించాలన్నారు. పరీక్షలకు బాలింతలు, దివ్యాంగులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి నిర్ణీత సమయం కంటే అరగంట ముందే అనుమతించాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ అధికారిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఏఎన్ఎంను నియమించాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. దివ్యాంగుల కోసం స్రైబ్స్ను బయట నుంచి అనుమతించరని, ఇందుకు విద్యా శాఖే ఏర్పాట్లుచేయాలన్నారు. దివ్యాంగులకు పరీక్ష రాయడానికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో అభ్యర్థుల కోసం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. సమీక్షలో విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ, సమగ్రశిక్ష ఏపీసీ బి.శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.