Share News

AP News: ‘టారిఫ్‌’ తూచ్‌!

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:47 AM

వినియోగదారుల నుంచి విద్యుత్తు బిల్లుల వసూలులో అత్యంత కీలకమైన వార్షిక వాస్తవ ఆదాయ, వ్యయ నివేదిక(ఏఆర్‌ఆర్‌)కు విలువ లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగా ప్రతి ఏటా విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్‌)లు వార్షిక ఏఆర్‌ఆర్‌లను సమర్పించాక.. వాటిని విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) పరిశీలించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.

AP News: ‘టారిఫ్‌’ తూచ్‌!

ఒకసారి టారిఫ్‌ ఆమోదించాక ఏడాదంతా ఆ చార్జీలు అమలవ్వాలి

కానీ, జగన్‌ హయాంలో అంతా రివర్స్‌.. ‘ట్రూఅప్‌’ పేరిట దొడ్డిదారి బాదుడు

ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల మోత

ఐదేళ్లలో రూ.24,593 కోట్ల భారం.. నేడు వార్షిక టారిఫ్‌ విడుదల

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి):

వినియోగదారుల నుంచి విద్యుత్తు బిల్లుల వసూలులో అత్యంత కీలకమైన వార్షిక వాస్తవ ఆదాయ, వ్యయ నివేదిక(ARR)కు విలువ లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగా ప్రతి ఏటా విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్‌)లు వార్షిక ఏఆర్‌ఆర్‌లను సమర్పించాక.. వాటిని విద్యుత్తు నియంత్రణ మండలి(APERC) పరిశీలించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. అనంతరం, టారిఫ్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతుంది. ఇలా టారిఫ్‌ను ఆమోదించాక ఏడాది మొత్తం అవే ధరలు అమలవుతాయి. ఇది దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానం. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు చార్జీల వసూలులో ఒక విధానం లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకసారి వార్షిక ఆదాయ వ్యయ నివేదికను ఈఆర్‌సీ ఆమోదించాక, మధ్యలో విద్యుత్తు చార్జీలలో మార్పులు చేర్పులూ చేస్తూ వినియోగదారులపై ఆర్థిక భారం మోపే అవకాశం ఉండదు. కానీ.. ఇప్పుడు ఆ మార్గదర్శకాలు అమలు కావడం లేదు. 2019 తర్వాత వ్యయ నివేదికలను మూడు నెలలకోసారి.. తర్వాత ప్రతినెలా డిస్కమ్‌లు సమర్పించాల్సి ఉంటుందని సెంట్రల్‌ ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ అథారిటీ(CERC) మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో.. వార్షిక ఆదాయ వ్యయ నివేదికకు విలువ లేకుండా పోయింది. గడచిన ఐదేళ్లుగా పెరిగిన విద్యుత్తు చార్జీలు.. ట్రూఅప్‌ పేరిట వినియోగదారులపై పడుతున్న రూ.వేలకోట్ల భారాలను పరిశీలిస్తే డిస్కమ్‌లపై ‘నియంత్రణ’ తెలుస్తోందని విద్యుత్తు రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనల సమయంలో..

టారిఫ్‌ ప్రతిపాదనల సమయంలో.. డిస్కమ్‌లు అదనపు వ్యయం విషయానికి సంబంధించి ఈఆర్‌సీకి వివరాలను ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకసారి ధర నిర్ణయం జరిగిపోయి లావాదేవీలు ప్రారంభమయ్యాక.. వాస్తవ ఖర్చులంటూ డిస్కమ్‌లు కొత్తగా ప్రతిపాదనలు చేయడం, వాటికి ఈఆర్‌సీ ఆమోదం తెలిపి, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఒకసారి ధరను నిర్ధారించాక మళ్లీ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయంటూ డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఎందుకు నిలదీయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోమవారం 2024–25 వార్షిక టారిఫ్‌ను ఈఆర్‌సీ విడుదల చేస్తోంది. ఈ టారిఫ్‌ విడుదల చేశాక ట్రూఅప్‌ చార్జీలు ఉండబోవని ఈఆర్‌సీ స్పష్టత ఇస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి.. వార్షిక టారిఫ్‌ ప్రకటనకు.. ఆచరణకూ పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నిలకడలేని చార్జీల విధానం అమలులో ఉన్నప్పుడు.. ప్రత్యేకంగా ఈఆర్‌సీ నియంత్రణకు హేతుబద్ధత ఏముంటుందన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

ఐదేళ్లలో ఎనిమిది సార్లు బాదుడు

● 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై 90పైసల పెంపుతో రూ.1300 కోట్లు భారం

● 2020 మేలో కరోనా శ్లాబుల మార్పుతో రూ.1500 కోట్లు

● 2021 ఏప్రిల్‌లో కిలోవాట్‌కు రూ.10 పెంచడంతో రూ.3542 కోట్లు భారం

● 2014–19 ట్రూఅప్‌ చార్జీల పేరుతో రూ.3669 కోట్లు భారం

● ఏప్రిల్‌ 2022 శ్లాబులు కుదించడంతో రూ.3900 కోట్లు

● 2021–22 విద్యుత్తు కొనుగోళ్ల సర్దుబాటు పేరుతో రూ.3082 కోట్లు భారం

● 2023 మే నుంచి ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ పేరుతో రూ.400 కోట్లు

● 2022–23 ట్రూఅప్‌ చార్జీల ప్రతిపాదనలు రూ.7200 కోట్లు

Updated Date - Mar 11 , 2024 | 11:47 AM