Share News

మహిళా ఓటర్లే నిర్ణేతలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:05 AM

జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సెగెంట్ల పరిధిలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.

మహిళా ఓటర్లే నిర్ణేతలు

- అభ్యర్థుల గెలుపోటములు వారిపైనే..

- ఏడు నియోజకవర్గాల్లో కీలకం

- పురుషుల కంటే 17,466 మంది అధికం

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 18: జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సెగెంట్ల పరిధిలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం 16,27,024 మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే 17,466 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం విశేషం. జిల్లాలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎచ్చెర్ల విజయనగరం లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోకి చేర్చిన విషయం విదితమే. మిగిలిన ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 1,37,488 మహిళా ఓటర్లు ఉండగా, 1,37,254 మంది మహిళా ఓటర్లతో ఇచ్ఛాపురం నియోజకవర్గం రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం మహిళా ఓటర్ల కోసం మేనిఫెస్టోలో ప్రత్యేక పథకాలు మహిళలకు ప్రకటిస్తున్నారు. కొత్త కొత్త పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో పార్టీలు తలమునకలయ్యాయి. ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

నియోజకవర్గం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు

ఇచ్ఛాపురం 1,37,254 1,30,544

పలాస 1,11,709 1,06,877

టెక్కలి 1,18,129 1,17,511

పాతపట్నం 1,12,696 1,12,095

శ్రీకాకుళం 1,37,488 1,34,866

ఆముదాలవలస 97,477 95,987

నరసన్నపేట 1,07,434 1,06,841

===========================================

మొత్తం ఓటర్లు 8,22,187 8,04,721

=============================================

Updated Date - Apr 19 , 2024 | 12:05 AM