Share News

ఓటేసిన పాపానికి నరకం చూపిస్తారా?

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:34 AM

ఒక్క చాన్సు అంటూ మాయచేయడంతో గత ఎన్నికల్లో ఓటేసిన పాపానికి ప్రజలకు నరకాన్ని చూపించడం దారుణమని టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటేసిన పాపానికి నరకం చూపిస్తారా?
గుంతల రోడ్లపై నిరసన తెలుపుతున్న గొండు శంకర్‌

- గుంతల రోడ్డుపై టీడీపీ నాయకులు నిరసన

శ్రీకాకుళం క్రైం: ఒక్క చాన్సు అంటూ మాయచేయడంతో గత ఎన్నికల్లో ఓటేసిన పాపానికి ప్రజలకు నరకాన్ని చూపించడం దారుణమని టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రూరల్‌ మండలం రాగోలు లో నిర్వహించిన బాబుతోనే భవిష్యత్‌ గ్యారంటీ.., రా..కదలి రా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారిలో గుంతలను ఆయన పరిశీలించి రాగోలు నుంచి ఆర్టీసీ కాలనీ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో ఒక్క రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టలేదన్నారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్లే రోడ్డులో రోజూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కొంతమంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారందరి చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ తమ్మినేని, మంత్రి ధర్మాన తమ స్వంత నియోజక వర్గాల్లోని రోడ్డు దుస్తితి ఇలా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి సాధ్యపడుతుందని శంకర్‌ అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ మూకళ్ల శ్రీను, సర్పంచ్‌లు బైరి నరేష్‌, రుప్ప లక్ష్మి, రంది అప్పలస్వామి, మాజీ సర్పంచ్‌ పేడాడ రామారావు, ఎ.చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:34 AM