ఏమైందబ్బా?
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:44 PM
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ శుక్రవారం నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు.
- వైసీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి ధర్మాన దూరం
- చివరి నిమిషంలో హాజరై.. ప్రక్రియ పూర్తికాకముందే నిష్కమణ
శ్రీకాకుళం అర్బన్, ఏప్రిల్ 19: శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ శుక్రవారం నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. అయితే, ఈ ర్యాలీకి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ అభ్యర్థులంతా హాజరైనా ధర్మాన ప్రసాదరావు, ఆయన వర్గీయులు మాత్రం గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పిరియా విజయ, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీను, తమ్మినేని సీతారాం హాజరై పేరాడ తిలక్తో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు. కానీ, శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉండడంపై చర్చానీయాంశంగా మారింది. చివరి క్షణంలో హడావుడిగా కలెక్టరేట్కు ధర్మాన వచ్చారు. అయితే, తిలక్ నామినేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే ఆయన వెనుతిరిగారు. దీంతో ఏమైంటుందబ్బా అని అంతా చర్చించుకుంటున్నారు.