Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:16 AM

వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఆలయ ప్రాంగణం హరి నామస్మరణతో మార్మోగింది.

కల్యాణం.. కమనీయం
వాసుదేవుని కల్యాణం తిలకిస్తున్న భక్తులు

- ఘనంగా వాసుదేవుని బ్రహ్మోత్సవాలు

- మార్మోగిన హరి నామస్మరణ

మందస, మార్చి 3: వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఆలయ ప్రాంగణం హరి నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, త్రిదండి దేవనాథరామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో కల్యాణాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయం నుంచి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి, వాసుదేవుని ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపంపై వేంచేసి పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అనంతరం స్వామి కల్యాణాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించి పునీతులయ్యారు. స్వామి అనుగ్రహం కోసం విష్ణుసేవ , సుదర్శన యాగం నిర్వహించారు. త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేశారు. దేవుని కృపతో ఈ ప్రాంతమంతా సుఖసంతోషాలు, పాడిపంటలతో కళకళలాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని కోరారు. మంత్రి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తదితరులు వాసుదేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కూర్మాచార్యులు శిరీషకు శేష వస్త్రాలను అందించారు. మందస, పలాస పట్టణాలకు చెందిన పలువురు మహిళలు కోలాట ప్రదర్శన చేపట్టారు.

నేటి కార్యక్రమాలు..

సోమవారం ఉదయం పొన్నచెట్టు వాహనం, తెప్పోత్సవం, అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే బెందాళం దుర్గాప్రసాద్‌ బృందం సంగీత విభావరి, శ్రీసాయిమోహన్‌ నృత్య కళానికేతన్‌ కళాకారుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 12:16 AM