ప్రతిపక్ష సభ్యుల ప్రాదేశికాలపై చిన్నచూపు తగదు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:32 AM
ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాదేశికాల పై చిన్నచూపు తగదని బిర్లంగి ఎంపీటీసీ సభ్యురాలు దక్కత ఏకాంబరీదేవి అధికారులను నిలదీశారు.
![ప్రతిపక్ష సభ్యుల ప్రాదేశికాలపై చిన్నచూపు తగదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇచ్ఛాపురం రూరల్: ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాదేశికాల పై చిన్నచూపు తగదని బిర్లంగి ఎంపీటీసీ సభ్యురాలు దక్కత ఏకాంబరీదేవి అధికారులను నిలదీశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. బిర్లంగి పంచాయతీలో సబ్సెంటర్లో ఉన్న ఏఎన్ఎంను కవిటి మండలం రాజపురం డిప్యూటేషన్పై పంపించడం ఏంటని, దీనివల్ల ఇక్కడివారి పరిస్థితి ఏమిటని వైద్యుడు వెచ్చా సంతోష్ను నిలదీశారు. ఇచ్ఛాపురం నుంచి ధాన్యాన్ని పలాస, టెక్కలి మిల్లులకు కేటాయిస్తుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని కేశుపురం, కేదారిపురం సర్పంచ్లు జి.ఢిల్లీరావు, ఎన్.సారఽథి అన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కారణంగా పంటలు పూర్తిగా పోయాయని వారికి నష్ట పరిహారం మాటేమిటని ఎంిపీపీ బోర పుష్ప, జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ ఏవో భార్గవిని ప్రశ్నించారు. అలాగే అధికారులు వారిశాఖ సమీక్ష అయిపోయిన తర్వాత వెనుదిరగడంతో సమావేశ మందిరం అధికారులు లేక బోసిపోతుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. జడ్పీటీసీ ఉప్పాడ నారాయణం, వైస్ ఎంపీపీలు గురుమూర్తి, వివేకానంద రెడ్డి, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, ఎంఈవో అప్పారావు, సీడీపీవో పి.నాగరాణి, ఏవో భార్గవి తదితరులు పాల్గొన్నారు.