ఉప్పొంగిన నాగావళి
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:53 PM
జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో భారీగా వరదనీరు చేరడంతో తీర ప్రాంత గ్రామస్థులకు ముంపు భయం వెంటాడుతోంది.
- పెద్దగనగళ్లవానిపేటలో 600 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
పలు గ్రామాలకు పొంచి ఉన్న ముంపు ముప్పు
భయాందోళనలో ప్రజలు
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 10: జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో భారీగా వరదనీరు చేరడంతో తీర ప్రాంత గ్రామస్థులకు ముంపు భయం వెంటాడుతోంది. నాగావళి నదిలో నీరు.. శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేటలోని సముద్ర తీరం(సంగం)లో కలుస్తోంది. మంగళవారం పెద్దఎత్తున నీరు చేరడంతో సముద్రం 600 మీటర్లు ముందుకొచ్చింది. తీరం కోతకు గురై.. బోట్లు, తెప్పలు, వలలు కొట్టుకుపోయాయి. ఈక్రమంలో ఉప్పుటేరు వాగు ద్వారా గ్రామంలోకి నీరు చేరుతుండడంతో పెద్దగనగళ్లవానిపేట వాసులు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ముంపు ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, టీడీపీ నేత మైలపిల్లి నర్శింగరావు మత్స్యకారులతో కలిసి తీరంలో పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు.