తమ్మినేనికి ఎదురీతే!
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:13 AM
స్పీకర్ తమ్మినేని సీతారామ్కు ఈ సారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) నుంచే ఎదురుదాడి తగులుతోంది. జగన్ ఒక్కచాన్స్ కారణంగా 2019 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని గెలుపొం దారు. అనూహ్యంగా స్పీకర్ పదవి పొందారు.
- వైసీపీ శ్రేణుల నుంచే ఎదురుదాడి
- ఇండిపెండెంట్ అభ్యర్థిగా సువ్వారి ప్రచారం
- సీతారామ్కు టికెట్ ఇచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
స్పీకర్ తమ్మినేని సీతారామ్కు ఈ సారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) నుంచే ఎదురుదాడి తగులుతోంది. జగన్ ఒక్కచాన్స్ కారణంగా 2019 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని గెలుపొం దారు. అనూహ్యంగా స్పీకర్ పదవి పొందారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయనే వైసీపీ తరపున బరిలో దిగనున్నారు. కాగా.. ఈసారి మాత్రం ఆయనకు సొంత పార్టీ నుంచే అసంతృప్తి సెగలు, వర్గపోరు కారణంగా ఎదురీత ఈదాల్సిన పరి స్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడాలేనంతగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలే కాదు.. కొన్ని నెలల కిందట ముఖ్య మంత్రి జగన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను సైతం వేర్వేరుగా జరుపుకొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని పేరు ఖరారు కాగానే.. గంటల వ్యవధిలో ఆమదాలవలస నియోజకవర్గంలో రాజీనామాల పర్వం జోరందుకుంది. రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శిగా సువ్వారి గాంధీ మొన్నటివరకు కొనసాగారు. ఓ పదవి విషయంలో గాంధీని తమ్మినేని సీతారాం పక్కనబెట్టారు. దీంతో వారి మధ్య వర్గ విభేదాలు పెరిగాయి. వైసీపీలోనే ఉంటూ నేరుగా తమ్మి నేని ఎదురిస్తూ గాంధీ తిరుగుబావుటా ఎగురవేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మి నేనికి టికెట్ ఇవ్వకూడదని.. వెంటున్న వారికి న్యాయం చేయడం లేదని అధిష్ఠా నానికి గాంధీ తెలిపారు. గాంధీ సతీమణి దివ్య పొందూరు మాజీ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. తన బంధువైన సువ్వారి సువర్ణకు.. తమ్మినేనితో సంబంధం లేకుండానే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అధిష్టానం కట్ట బెట్టింది. ఈ అవకాశాన్ని పాజిటివ్గా మలుచుకుని.. ఆమదాలవలస నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో బుక్ డిపో సెంటర్లను తెరిపించారు. యువతకు చిన్న పాటి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్నిక లకు సమయం ఆసన్నమవడంతో ఇటీవల వర్గపోరును పక్కనబెట్టి వైసీపీ అధిష్ఠానం తమ్మినేనికే టికెట్ ఇచ్చింది. దీంతో అధిష్ఠానం తీరును వ్యతిరేకిస్తూ గాంధీ, తన సతీమణి దివ్య, తన బంధువు సువర్ణ.. ఇటు పార్టీ పదవులకు, అటు నామినేటెడ్ పదవులకు సైతం రాజీనామా చేసేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి తమ్మినేనిని ఢీకొడతానని.. ఓడించి తీరు తానని ప్రచారం చేస్తున్నారు. తమ్మినేని అనుచరులు కూడా మద్దతుగా పాల్గొం టున్నారు. అలాగే వైసీపీ నాయకులు చింతాడ రవికుమార్, కోట గోవిందరావు సైతం తమ్మినేనికి వర్గానికి దూరంగా ఉంటూ సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో సుమారు 20వేల ఓట్ల చీలిక జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో సీతారామ్కు గడ్డుపరిస్థితి ఎదురుకాగా.. టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.