డబ్బు తీసుకెళ్తున్నారా?
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:49 PM
ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని చోట్లా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
-ఎన్నికల నిబంధనలు మరచిపోవద్దు
- రూ.50వేలకు మించి తీసుకెళ్లకూడదు
-సరైన ఆధారాలు సమర్పించాల్సిందే
గార: ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని చోట్లా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలతో పాటు ప్రజలు తమతో పాటు తీసు కెళ్తున్న బ్యాగులు, ఇతర వ స్తువులు సైతం పరిశీలిస్తు న్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసు కువెళ్తే స్వాధీనం చేసుకుం టారు. కొన్నిసార్లు సొంత పనుల మీద ఇతర ప్రాంతాలకు నగదు తీసుకువెళ్తున్నా ఇబ్బందులు తప్పవు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు తగిన ఆధారాలతో అధిక మొత్తంలో నగదు తీసుకుని వెళ్లవచ్చు.
ఫైనాన్స్..చిట్టీల వ్యాపారం
చిట్టీల, ఫైనాన్స్ సంస్థల్లో నిత్యం భారీగా లావాదేవీలు జరుగుతాయి. కలెక్షన్ ఏజెంట్ల వద్ద రూ.లక్షల్లో నగదు ఉంటుంది. వీరు ఆ రోజు చేసిన కలెక్షన్ పద్దులు, బాకీ ఉన్న నగదు.. వసూలైన మొత్తం.. ఇలా అన్ని వివరాలతో పాటు కస్టమర్ల సంతకంతో కూడిన ప్రతులను తప్పసరిగా తమ వెంట ఉంచుకోవాలి.
బంగారు ఆభరణాల కొనుగోలులో...
శుభకార్యాలు నిర్వహించే సమయంలో బంగారు, ఇతర వస్తువుల కొనుగోలుకు నగదు తీసుకు వెళతారు. శుభకార్యాల కోసం నగదు తీసుకువెళ్లే వారు తమ వెంట శుభలేఖ ఉంచుకోవాలి. అదే విధంగా పోలీసులు అడిగిన అన్ని వివరాలకు పూర్తిగా సమచారం ఇవ్వాలి.
బ్యాంకు లావాదేవీలకు...
బ్యాంకు లావాదేవీలు రూ.50 వేలు మించితే ఆధారాలు చూపించాలి. చెక్కు ద్వారా నగదు విత్ డ్రా చేస్తే చెక్కు జెరాక్స్, పాస్ బుక్ ఉంచుకోవాలి. ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేస్తే ఏటీఎం స్లిప్లు జాగ్రత్త చేయాలి. ఒక వేళ నగదు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళితే... సంబందిత అన్ని వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఎవరు, ఎందుకు ఇచ్చారో ఆధారాలు ఉండాలి.
విద్యా సంస్థల్లో ఫీజులు
పిల్లలు చదువుల కోసం సంబంధిత పారఠశాల, కళాశాలల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాలంటే నగదు తీసుకుని వెళ్లలక తప్పదు. అటువంటి సమయంలో సంబంధిత కళాశాల యాజమాన్యాలు ఇచ్చిన రసీదు తప్పకుండా ఉండాలి. నగదు చెల్లించకముందు ఫీజు కట్టాలనే నోటీసులు వెంట ఉంచుకోవాలి. అవసరమైతే ఆన్లైన్లో ఫీజులు చెల్లించడం మంచిది.
ఆసుపత్రుల బిల్లులకు...
అత్యవసర సమయాల్లో అధిక మొత్తంలో ఆసుపత్రి బిల్లులు చెల్లించక తప్పదు. అటువంటి సమయంలో రోగి మెడికిల్ కేస్ షీట్, మెడికల్ సర్టిఫికెట్, ఆసుప్రతి బిల్లులు అందుబాటులో ఉంచుకోవాలి.
పంటల డబ్బులు..
ప్రస్తుతం రైతులు తమ పంట ఉత్పత్తిలైన మొక్కజొన్న వరి, పచ్చిమిర్చి, మొదలైన పంటలను విక్రయిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదును ఇంటికి తీసుకెళ్లేటప్పుడు తగిన ఆధారాలను దగ్గర ఉంచుకోవాలి.