ఏమైందో..
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:28 AM
ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన వలస కూలీ నీలాపు గణేష్(27) ముంబైకి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగత్పూర్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
- ముంబైలో వలస కూలీ అనుమానాస్పద మృతి
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 15: ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన వలస కూలీ నీలాపు గణేష్(27) ముంబైకి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగత్పూర్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన నీలాపు కామరాజు, తరిణమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దుర్యోధన సేఫ్టీ ఇంజనీర్గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. కూతురు లావణ్య ఇంటి వద్దనే ఉంది. రెండో కుమారుడు గణేష్ వెల్డర్గా పనిచేస్తున్నాడు. గత నెల 16న ఉపాధి కోసం దుబాయ్ వెళ్తానని ఇంట్లో చెప్పి.. ముంబై వెళ్లాడు. దుబాయి వెళ్లేందుకు వీసా రాకపోవడంతో ముంబై సమీపంలోని ఎగత్పూర్లో ఉంటున్నాడు. ఆదివారం ముంబై జీఆర్పీ పోలీసుల నుంచి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఏమైందో తెలియదు కానీ.. గణేష్ శనివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు విలపిస్తూ ముంబై పయనమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.