అవినీతి అధికారులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:26 PM
జిల్లాలోని వివిధ స్టేషన్ల పనిచేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అవినీతి ఆరోపణలు వస్తున్న కొన్ని పోలీసుస్టేషన్లపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఒడిశా నుంచి మద్యం తీసుకువస్తున్న ఓ వ్యక్తిని బెదిరించి రూ.5వేలు లంచం తీసుకున్న ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
- లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 21: జిల్లాలోని వివిధ స్టేషన్ల పనిచేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అవినీతి ఆరోపణలు వస్తున్న కొన్ని పోలీసుస్టేషన్లపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఒడిశా నుంచి మద్యం తీసుకువస్తున్న ఓ వ్యక్తిని బెదిరించి రూ.5వేలు లంచం తీసుకున్న ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పాతపట్నం పోలీసుస్టేషన్లోని కానిస్టేబుల్ శ్యామలరావు.. ఇటీవల ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఆయనను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. మద్యంతోపాటు రూ.5వేలు లంచం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పెషల్బ్రాంచ్ పోలీసులతో విచారణ చేశారు. లంచం తీసుకోవడం వాస్తవమని తేలడంతో కానిస్టేబుల్ శ్యామలరావును సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. పోలీసు శాఖలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులను ఎస్పీ హెచ్చరించినట్టు భోగట్టా. ఇప్పటికే జిల్లాలో అన్ని పోలీసుస్టేషన్లను సందర్శించిన ఎస్పీ.. కొందరు పోలీసులపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కానిస్టేబుల్ శ్యామలరావు భాగోతం బట్టబయలైనట్టు సమాచారం.
తీర ప్రాంత భద్రతపై అప్రమత్తం: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
సంతబొమ్మాళి: తీరప్రాంత మైరెన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. బుధవారం నౌపడ, భావనపాడు మెరైన్ పోలీస్స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సముద్రం గుండా వచ్చే చొరబాటుదారులను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. భావనపాడు తీరానికి వచ్చే పర్యాటకులు.. సముద్రం లోపలికి వెళ్లకుండా భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో నౌపడ ఎస్ఐ కిషోర్వర్శ ఉన్నారు.