అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:50 AM
అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ఆయన జేసీ ఎం.నవీన్తో కలిసి 178 అర్జీలను స్వీకరించారు.
![అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240224/26plsf4_01c08e9100.gif)
కలెక్టరేట్ : అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ఆయన జేసీ ఎం.నవీన్తో కలిసి 178 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్ దొరబాబు, జడ్పీ సీఈవోడి.వేంకటేశ్వరరావు, డీఎంహెచ్వో మీనాక్షి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనులు చేసినా డబ్బులివ్వడం లేదని ఫిర్యాదు
మెళియాపుట్టి: ఐటీడీఏ ద్వారా 2019లో సుమారు రూ.10 లక్షలకు సంబంధించి చేపట్టిన వాటర్షెడ్ పనులకు బిల్లుల చెల్లింపులో అంపురం పంచాయతీ సర్పంచ్ డి.జమ్మయ్య చర్యలు తీసుకోవడం లేదని ఇలాయిపురం, అంపురం పంచాయతీల గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన స్పందనలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఇటీవల పంచాయతీ ఖాతాలో 10 శాతం నిధులు జమయినా బిల్లులివ్వలేదని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. గట్టిగా అడిగితే అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని, తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
తక్షణం హుద్హుద్ గృహాలు అందించాలి
పలాస: పలాస నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో, హుద్హుద్ ఇళ్లను ఎన్నికల షెడ్యూల్ రాకముందే లబ్ధిదారులకు అందించా లని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రాయి బాలకృష్ణ యాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన ‘స్పందన’లో కలెక్టర్ మనజిర్ జిలానీ సమూన్ కు వినతిపత్రం అందించారు. అలాగే కాశీబుగ్గ నుంచి చిన్న బడాం ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని, ప్రజలుపడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని కోరారు.