మంత్రి ధర్మానపై ఆరు కేసులు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:32 AM
మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఆరు కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. శ్రీకాకుళం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్ వేశారు.
శ్రీకాకుళం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఆరు కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. శ్రీకాకుళం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తనపై మూడు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు, మూడు సీబీఐ కేసులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఒకటి, శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి. అలాగే 2011 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన మూడు కేసులున్నాయని వివరించారు. విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలలో 1974-1976 మధ్య ఇంటర్ చదివినట్లు ప్రస్తావించారు.
ఆస్తులివీ...
ధర్మాన ప్రసాదరావు వద్ద ప్రస్తుతం చేతిలో రూ.18.40 లక్షలు, సతీమణి గజలక్ష్మి వద్ద రూ.4.70 లక్షలు ఉన్నాయి. 20.68 ఎకరాల వ్యవసాయ భూమి ధర్మాన పేరుతో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన దంపతుల పేరిట అపార్ట్మెంట్లు ఉన్నాయి. మొత్తం చరాస్తి ధర్మాన పేరిట రూ.6.06కోట్లు, భార్య పేరిట రూ.5.87 కోట్లు, స్థిరాస్తుల విషయానికొస్తే ధర్మాన పేరిట రూ.9.58 కోట్లు, భార్య పేరిట రూ. 3.43 కోట్లు విలువగలవి ఉన్నాయి.