Share News

సిక్కోలును అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:35 PM

అందరికీ అందుబాటులో ఉంటూ, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

సిక్కోలును అభివృద్ధి చేస్తా
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యం

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టరేట్‌, జూలై 5: అందరికీ అందుబాటులో ఉంటూ, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. జిల్లాలో అధికశాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని తొలి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియా ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ‘నాది మహారాష్ట్ర. ఇంజనీరింగ్‌ చదివి 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారిగా తొలుత గుంటూరు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశాను. తర్వాత నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా, కాకినాడ, విజయవాడ కార్పొరేషన్ల కమిషనర్‌గా పనిచేశా. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి అంశాలపై పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఫలితాలు సాధిస్తాం. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. జిల్లాలో ఎటువంటి సమస్యలున్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చ’ని కలెక్టర్‌ తెలిపారు.

- అంకితభావంతో పనిచేయాలి

‘అధికారులంతా అంకిత భావంతో పనిచేయాలి. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలి’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ జీఆర్‌ రాధిక, జేసీ నవీన్‌తో కలిసి.. అధికారులతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. అలాగే నూతన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అలాగే పింఛన్ల పంపిణీపై డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌, ఆర్డీవోలు సీహెచ్‌.రంగయ్య, భరత్‌నాయక్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు, డీపీవో వేంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌, డీఆర్డీఏ, డ్వామా పీడీలు శాంతిశ్రీ, కిరణ్‌కుమార్‌, చిట్టిరాజు, ఏపీసీ జయప్రకాష్‌, మైన్స్‌ డీడీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, సీపీవో ప్రసన్నలక్ష్మి, వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌, ఎల్డీఎం సూర్యకిరణ్‌, ఏఈ రాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:35 PM