Share News

శివారు రైతాంగానికి సాగునీరు అందించండి

ABN , Publish Date - May 26 , 2024 | 11:13 PM

ఖరీఫ్‌ సీజన్‌ దగ్గరపడిందని, వంశధార కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌కు లేఖ రాశారు. ‘

శివారు  రైతాంగానికి సాగునీరు అందించండి

- కలెక్టర్‌కు లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు

టెక్కలి, మే 26: ఖరీఫ్‌ సీజన్‌ దగ్గరపడిందని, వంశధార కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌కు లేఖ రాశారు. ‘జిల్లా రైతాంగం వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఐదేళ్లుగా వంశధార కాలువలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయి. వంశధార ప్రధాన ఎడమ కాలువ, దాని అనుబంధ కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోయాయి. షట్టర్లు, మదుములు మరమ్మతులకు గురవడంతో శివారు ప్రాంతానికి సక్రమంగా నీరు అందడం లేదు. ఈ ఏడాదైనా కాలువల్లో పూడికలు తొలగించి సక్రమంగా సాగునీరు అందించాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలు నిర్మించాం. వాటి ద్వారా రైతులకు కొంతమేరకు సాగునీరు అందేది. ప్రస్తుత పాలకుల చేతకాని తనం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఎత్తిపోతల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో ఖరీదైన కాపర్‌వైర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ చోరీకి గురయ్యాయి. ఈ పథకాల కింద ఉన్న రైతాంగం కూడా ఈ జిల్లా వాసులే అని గుర్తించాలి. వారిపై వివక్ష చూపించకుండా సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్న నరసన్నపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో వ్యవసాయ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఖరీఫ్‌లో రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేట్టాలి.’ అని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.

Updated Date - May 26 , 2024 | 11:13 PM